న్యూఢిల్లీ, జూన్ 3: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనంలో భారీగా కోత పడింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఆయ న అందుకున్నది కేవలం రూ.56.44 కోట్లు మాత్రమే. అంతక్రితం ఏడాది అందుకున్న రూ.71 కోట్ల కంటే 21 శాతం తక్కువ కావడం విశేషం. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. స్టాక్ యూనిట్స్ ఆధారంగా వచ్చే రాబడి తగ్గుముఖం పట్టడం వల్లనే వేతనంలో కోత పడింది.
2019లో సంస్థ కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. పనితీరు ఆధారంగా ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించింది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి అందుకున్న రూ.57.32 కోట్ల కంటే పరేఖ్ అందుకున్న వేతనం తక్కువగా ఉండటం విశేషం. మరోవైపు, తన పోటీ సంస్థ విప్రో సీఈవో థిర్రీ డెలాపోర్ట్ రూ.82.4 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. థిర్రీ వేతనం కూడా 5 శాతం తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సలీల్ పరేఖ్ వేతనం కింద రూ.6.67 కోట్లు, పదవీ విరమణ తర్వాత పొందే ప్రయోజనాల కింద రూ.45 లక్షలు, వేరియబుల్ పే లేదా బోనస్ కింద రూ.18.73 కోట్లు లభించాయి. సాధారణ ఉద్యోగి అందుకున్న రూ.9 లక్షల కంటే 627 రెట్లు అధికంగా పరేఖ్ వేతనం పొందడం విశేషం.