ప్రారంభించిన బ్రిటన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం
రూ.250 కోట్లతో జహీరాబాద్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న సంస్థ
హైదరాబాద్, మార్చి 31: బ్రిటన్కు చెందిన ప్రీమియం ఈవీల తయారీ సంస్థ వన్మోటో ఇండియా.. దేశంలో తొలిసారిగా హైదరాబాద్లో తన తొలి ఎక్స్పీరియన్స్ హబ్ను ప్రారంభించింది. ఈవీలను కొనుగోలుదారులకు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పీరియన్స్ హబ్ను రాష్ట్ర ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ హబ్లో కంపెనీకి చెందిన ఉత్పత్తులు, టెక్నాలజీకి సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను ప్రదర్శించనున్నది. మరోవైపు, దేశీయ, రాష్ట్రంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్కు సమీపంలో జహీరాబాద్ వద్ద రూ.250 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి భూమి కేటాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ప్లాంట్ వివరాలు
‘ఈవీలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆశాజనకంగా ఉండటంతో ఇక్కడ యూనిట్ను నెలకొల్పాలని నిర్ణయించడం జరిగింది. వచ్చే పది నుంచి పదిహేను రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి స్థలం కేటాయింపులు జరుపవచ్చు. తొలి విడుత 10-15 ఎకరాలు, రెండో విడుత 25 ఎకరాల స్థలంలో యూనిట్ను నెలకొల్పాలనుకుంటున్నాం’
– సమీర్, వన్మోటో ఇండియా భాగస్వామి
‘ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో ప్రజలు విద్యుత్తు వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. పైగా ఈవీల నిర్వహణ ఖర్చు తక్కువ, పర్యావరణ హితం. తెలంగాణ రాష్ట్రం ఉత్తమ ఐటీ పాలసీ విధానాన్ని ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి.
– జయేశ్ రంజన్, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి