హైదరాబాద్, సెప్టెంబర్ 13(బిజినెస్ బ్యూరో): ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ సాయి సిల్క్స్(కళామందిర్) స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. ఈ నెల 20న ఐపీవోకి రాబోతున్నట్టు తాజాగా ప్రకటించింది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 18 బిడ్డింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపిన సంస్థ..ఈ ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.600 కోట్ల నిధులను సమీకరించబోతున్నది. ఈ వాటా విక్రయంలో భాగంగా ప్రమోటర్లకు చెందిన 2.70కోట్ల ఈక్విటీ షేర్లను బహిరంగా మార్కెట్లో ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయిస్తున్నది. ఇందుకు సంబంధించి షేరు ధరల శ్రేణిని మాత్రం సంస్థ ప్రకటించలేదు. ఈ నెల 20న ప్రారంభంకానున్న వాటా విక్రయం 22న ముగియనున్నది. గతంలో 1.80 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించుదామనున్నకున్న సంస్థ..దీనిని 2.70 కోట్లకు పెంచింది.
120 కోట్లతో 30 నూతన స్టోర్లు..
కళామందిర్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే సంస్థకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లో 54 స్టోర్లు ఉండగా..భవిష్యత్తులో కొత్తగా 30 స్టోర్లను ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకోసం మూలధన వ్యయం కింద రూ.125 కోట్ల నిధులను వెచ్చించనున్నట్టు ప్రకటించింది. వీటితోపాటు రూ.25 కోట్లతో రెండు గిడ్డంగులను నెలకొల్పబోతున్నది. నిర్వహాణ మూలధనం కింద రూ.280 కోట్ల నిధులను చొప్పించనున్నట్టు ప్రకటించిన సంస్థ..మరో రూ.50 కోట్లను తిరిగి రుణాలు చెల్లించడానికి వెచ్చించబోతున్నది.