Ola Electric | దేశీయ ఆటోమేజర్లు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఓలా ఎలక్ట్రిక్ సిద్ధమైంది. కమర్షియల్ వెహికల్స్ రంగంలోకి ఎంటర్ కావాలని ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయించినట్లు సమాచారం. త్రీ-వీలర్ ఎలక్ట్రిక్ కార్గో మార్కెట్లో ట్రియో జోర్తో మహీంద్రా అండ్ మహీంద్రా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. గత మేలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ ఏస్ ఈవీ ఆవిష్కరించింది. త్వరలో కస్టమర్లకు డెలివరీలు ప్రారంభించనున్నది.
ఆ బాటలోనే ఓలా ఎలక్ట్రిక్ పయనించనున్నది. వచ్చే ఏడాది ఎలక్ట్రిక్ త్రీ వీలర్, ఫోర్ వీలర్ ఈ-ఎస్సీవీలు తెస్తామని ఓలా ఎలక్ట్రిక్ అధికారి ఒకరు ధృవీకరించారు. ఓలా ఎలక్ట్రిక్ తీసుకు వచ్చే ఈ-ఎస్సీవీలకు ఫేమ్-2 స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వ సబ్సిడీలు వర్తిస్తాయి. లైట్ కమర్షియల్ వెహికల్స్ రంగంలోకి కూడా ఎంటర్ కావడంపై దృష్టి సారించనున్నది.
టాటా ఏస్ ఈవీపై ప్రస్తుతం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నది. ఎకో చార్జింగ్ సిస్టమ్ అభివృద్ధి చేయడంపై టాటా మోటార్స్ దృష్టి సారించింది. 39 వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ డెలివరీ చేయడానికి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలతో టాటా మోటార్స్ భాగస్వామ్య ఒప్పందాలు చేసుకున్నది. ఢిల్లీ, పుణె, ముంబై తదితర నగరాల్లో వీటిని డెలివరీ చేయనున్నది.