పోలీస్ కమిషనర్ తరుణ్జోషి
ఉచితంగా హోం ఐసొలేషన్ మందుల కిట్లు
హెల్ప్లైన్ సెంటర్ ప్రారంభం
హన్మకొండ, మే 18 : కరోనా పాజిటివ్ వచ్చి, హోం ఐసొలేషన్లో ఉంటు న్న వారికి ఉచిత మందుల కిట్లు అందిస్తున్న రెడ్క్రాస్ సంస్థ సేవలు అభినందనీయమని పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్జోషి అన్నారు. హన్మకొండ సుబేదారిలోని రెడ్క్రాస్లో సంస్థ పాలక వర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ సెంటర్(83673 56765, 0870-2456765) ప్రారంభం, ఉచిత కరోనా మెడికల్ కిట్ల పంపిణీ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ హోం ఐసొలేషన్లో ఉంటున్న వారి వద్దకే వెళ్లి ఉచితంగా మందులు ఇవ్వడం సంతోషకరమన్నారు. అనంతరం తలసేమియా సెంటర్ను సందర్శించి, బాధితుల వివరాలు తెలుసుకుని పండ్లు పంపిణీ చేశారు. యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందకు రావాలని కోరారు. అలాగే, జనరిక్ మందుల షాపును సందర్శించారు. ప్రజలు ఈ షాపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, కరోనా పాజిటివ్ రిపోర్టు, ఆధార్కార్డు చూపించి, కార్యాలయంలో ఉచితంగా మెడికల్ కిట్ను తీసుకెళ్లవచ్చని పాలకవర్గ సభ్యులు తెలిపారు. కిట్లు కావాల్సిన వారు 8367356765, 0870-2456765 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పీ విజయ్చందర్రెడ్డి, రాష్ట్ర ఎంసీ మెంబర్ ఈవీ శ్రీనివాసరావు, జిల్లా సభ్యులు డాక్టర్ ఎస్ విజయలక్ష్మి, డీసీపీ కే పుష్ప, హన్మకొండ ఏసీపీ జితేందర్రెడ్డి, సుబేదారి సీఐ రాఘవేందర్రావు, యూత్ రెడ్క్రాస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పోలీసులకు మాస్కుల పంపిణీ
హన్మకొండ సిటీ : పోలీసు అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలని సీపీ తరుణ్జోషి పిలుపునిచ్చారు. లాక్డౌన్ సందర్భంగా చెక్పోస్టుల వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి మంగళవారం ఆయన మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కరోనా నియంత్రణ కోసం కమిషనరేట్ పోలీసులు తమ వంతుగా బాధ్యతగా కృషి చేస్తున్నారన్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులపై ప్రజలకు గౌరవం పెరిగిందన్నారు. పోలీస్ సిబ్బంది తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీపీ పుష్ప, ఏసీపీలు గిరికుమార్, జితేందర్రెడ్డి, రవీంద్రకుమార్ పాల్గొన్నారు.