Ola Electric IPO | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఈవీ స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ అప్లికేషన్కు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆమోదం లభించిందని సమాచారం. దేశంలో ఐపీఓకు వెళుతున్న తొలి ఈవీ స్టార్టప్ గా ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. త్వరలో ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు అనుమతినిస్తూ అధికారికంగా సెబీ ఓ ప్రకటన చేస్తుందని సమాచారం. ఈ సంగతిని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కొందరు సన్నిహిత ఉద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్ నుంచి నిధుల సేకరణకు గతేడాది డిసెంబర్ 22న సెబీకి ఓలా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా కొత్త షేర్లు విడుదల చేసి రూ.5,500 కోట్ల నిధులు సేకరించాలని ఓలా ఎలక్ట్రిక్ ప్రణాళిక రూపొందించుకున్నది. అదనంగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద 95.2 మిలియన్ల షేర్లను ఐపీఓ ద్వారా మార్కెట్లో లిస్టింగ్ చేయాలని భావిస్తున్నది. ఓలా ఎలక్ట్రిక్ బ్యాంకర్లు తెలిపిన వివరాల ప్రకారం ఐపీఓ ద్వారా తన కంపెనీ విలువ 600 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది.