Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు (Stcok Markets) ఇవాళ భారీగా పతనమయ్యాయి. పెరుగుతున్న ముడిచమురు ధరలు, బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు, కొత్తగా తలెత్తిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ తీవ్రంగా దెబ్బతింది. ఫలితంగా సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) సూచీలు రెండు శాతానికి పైగా పతనమయ్యాయి. ఇవాళ్టి ట్రేడింగ్ రెండో సెషన్లో మార్కెట్ల పతనం మరింత వేగవంతమైంది.
ఇరాన్తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ‘ముగిసిపోయింది’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లలో అమ్మకాల సునామీ వచ్చింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతాయనే ఆందోళనలు, ప్రపంచ ఇంధన సరఫరాలపై దాని ప్రభావం గురించిన భయాలు ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు నడిపించాయి. మధ్యాహ్నం ట్రేడింగ్లో నిఫ్టీ దాదాపు 500 పాయింట్లు పడిపోగా, సెన్సెక్స్ 1,600 పాయింట్లకుపైగా నష్టపోయింది.
దాదాపు అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి స్పష్టంగా కనిపించింది. నిఫ్టీ 50లోని 50 కంపెనీలకుగాను 45 నష్టాల్లో ట్రేడయ్యాయి. ఈ తీవ్రమైన నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.4 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.476 లక్షల కోట్ల దిగువకు పడిపోయింది. అంతకుముందు ఉదయం సెషన్లోనే మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి.
సెన్సెక్స్ 364 పాయింట్ల నష్టంతో 77,816 వద్ద, నిఫ్టీ 139 పాయింట్ల నష్టంతో 24,259 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ సూచీ అత్యధికంగా నష్టపోయింది. వీటితోపాటు మీడియా, పీఎస్యూ బ్యాంక్, రియల్టీ, మెటల్, ఆటో, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా నష్టాలను చవిచూశాయి.