Hyderabad | న్యూఢిల్లీ, మార్చి 23: దేశవ్యాప్తంగా ఆఫీస్ స్థలాలకు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నది. దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలు కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్ స్థలాలు హాట్కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ జనవరి-మార్చి ఆరు మెట్రో నగరాల్లో ఆఫీస్ స్థలాల లీజులో 35 శాతం వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కోల్లీర్స్ ఇండియా తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్-6 నగరాలైన బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, హైదరాబాద్, పుణెలలో 13.6 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 10.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉన్నది.
హైదరాబాద్తోపాటు ముంబై, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్లలో ఆఫీస్ స్థలాల లీజు పెరగగా, కానీ, చెన్నైలో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్లో అత్యధికంగా 2.9 మిలియన్ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారని నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో తీసుకున్నదాంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. ఈ త్రైమాసికంలో ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు తమ లీజుకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, అలాగే వచ్చేవారంలో కేవలం మూడు రోజులు మాత్రమే ఉండటంతో ఈ నివేదికను విడుదల చేశామని వెల్లడించింది.
హైదరాబాద్లో కమర్షియల్ ఆఫీస్ స్థలానికి డిమాండ్ నిరాటంకంగా కొనసాగుతున్నది. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేయడానికి దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావడం ఇందుకు కలిసొస్తున్నది. చౌక ధరలు, మౌలిక సదుపాయాల కల్పనతో పెట్టుబడిదారులు నగర బాటపట్టారు. హై-టెక్ సిటీ, గచ్చిబౌలీ, మాదాపూర్లలో అత్యధికంగా లీజుకు తీసుకుంటున్నారు.
– అర్పిత్ మెహరోత్రా, కోల్లీర్స్ ఇండియా ఎండీ