జ్యోతినగర్ (రామగుండం), మార్చి 5: థర్మల్ పవర్ స్టేషన్లో 4,200 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం ఎన్టీపీసీ దేశంలోనే రెండో అతిపెద్ద విద్యుదుత్పత్తి సంస్థగా నిలిచింది. ఈ విషయాన్ని రామగుండం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు మంగళవారం వెల్లడించారు.
నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ, ఇతర రాష్ర్టాలకు నిరంతర విద్యుత్ను సరఫరా చేస్తున్న ఈ ప్రాజెక్టు చరిత్రలో ఒక మైలురాయిగా నిలువడానికి ఉద్యోగులు, కార్మికుల వల్లే ఇది సాధ్యమైందన్నారు. 40 ఏండ్ల క్రితం 200 మెగావాట్లతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం 2,600 మెగావాట్లకు విస్తరించింది. అలాగే 800 మెగావాట్ల మొదటి యూనిట్ను మార్చి 1, 2023న ప్రధాని నరేంద్ర మోదీ వాణిజ్య కార్యకలాపాలకు ప్రారంభించగా.. తాజాగా సోమవారం (ఈ నెల 4న) 800 మెగావాట్ల రెండో యూనిట్ను వర్చువల్ ద్వారా మోదీ దేశానికి అంకితం చేశారన్నారు.