వరుసగా ఐదు వారాల పాటు నష్టపోయిన ఎన్ఎస్ఈ నిఫ్టీ గతవారం ఎట్టకేలకు 170 పాయింట్ల లాభంతో 19.435 పాయింట్ల వద్ద ముగిసింది. యూఎస్లో వెలువడిన పలు ఆర్థిక గణాంకాలతో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుదలకు బ్రేక్ వేస్తుందన్న అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లను కుదుటపర్చడం..వారాంతంలో భారత మార్కెట్కు కలిసి వచ్చింది. అయితే బ్రెంట్ క్రూడ్ ధర 88 డాలర్ల స్థాయిని అధిగమించడం ఆందోళన కలిగిస్తున్నదని విశ్లేషకులు అంటున్నారు. వారమంతటా 19,250-19,450 పాయిం ట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన నిఫ్టీ 50 డీఎంఈఏ రేఖ సంచరిస్తున్న 19,295 పాయింట్ల స్థాయిని గత 14 ట్రేడింగ్ సెషన్లలో 6 దఫాలు పరీక్షించి, నిలుపుకోవడం సానుకూలాంశమని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోదీ వివరించారు. ఈ వారం 19,500 స్థాయి వద్ద షార్ట్ కవరింగ్ జరిగితే బుల్స్ తిరిగి నిఫ్టీలో ర్యాలీ తీసుకురాగలుగుతారని తెలిపారు. రానున్న కొద్ది రోజుల్లో ఆటోమొబైల్, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, రియల్టీ షేర్లు పాజిటివ్గా ట్రేడవుతాయని యాక్సిస్ సెక్యూరిటీస్ యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ హెడ్ రాజేశ్ పాల్వియా అంచనా వేశారు. ఈ వారం ఐటీ, పీఎస్యూ షేర్లు పెరిగే అవకాశం ఉందని ఈక్విటీరీసెర్చ్ ఆసి యా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ చెప్పారు.
ఈ వారం నిఫ్టీకి 19,250 వద్ద కీలకమైన మద్దతు ఉన్నదని, ఈ స్థాయిని కోల్పోతే తొలుత 19,000 వద్దకు, తర్వాతి రోజుల్లో 18,800 వరకూ తగ్గే ప్రమాదం ఉంటుందని వైష్ణవ్ అంచనా వేశారు. కీలక మద్దతును నిలుపుకుంటే, 19,600, 19,730 స్థాయిల్ని అందుకునే చాన్స్ ఉంటుందన్నారు. ఈ వారం నిఫ్టీ 19,500 స్థాయిని దాటితే పాజిటివ్ మూమెంటం నెలకొంటుందని జిమిత్ మోదీ చెప్పారు. 19,200 స్థాయిని వదులుకుంటే 18,900 వరకూ తగ్గవచ్చని విశ్లేషించారు. ఈ సెప్టెంబర్ డెరివేటివ్ సిరీస్లో నిఫ్టీ 19,550-19,700 శ్రేణి వరకూ పెరగవచ్చని, 19,200 స్థాయిని స్టాప్లాస్గా నిర్దేశించుకోవాలంటూ రాజేశ్ పాల్వియా ఇన్వెస్టర్లకు సూచించారు.
మార్కెట్ పల్స్
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీం, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లేదా ఇతర పోస్టాఫీస్ పథకాల్లో మదుపు చేస్తున్నవారు ఆధార్ అప్డేట్ కోసం ఈ నెలాఖరుకల్లా వారి ఆధార్ వివరాలను పోస్టాఫీస్ కార్యాలయాలు, బ్యాంక్ శాఖల్లో సమర్పించాలి. లేకపోతే వీరి ఖాతాలు అక్టోబర్ 1 నుంచి నిలిచిపోతాయి. అలాగే ఈ నెలాఖరు వరకే ఎస్బీఐ వుయ్ కేర్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లు సీనియర్ సిటిజన్లకు అందుబాటులో ఉంటాయి. డీమ్యాట్ నామినేషన్కు సెబీ ఇచ్చిన గడువు సెప్టెంబర్ 30తో ముగిసిపోతుంది.