కఠిన ద్రవ్య విధానం కొనసాగుతుందంటూ యూఎస్ ఫెడ్ ప్రెసిడెంట్ జెరోమ్ పొవెల్ ప్రకటించడం, ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం తీవ్రతరం కావడంతో గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ గరిష్ఠస్థాయిలో స్థిరపడలేకపోయింది. వారం మొత్తంమీద 208 పాయింట్లు నష్టపోయి 19,543 పాయింట్ల వద్ద ముగిసింది. రాజకీయ భౌగోళిక పరిస్థితులు, అంతర్జాతీయ సంకేతాలు మార్కెట్కు అనుకూలంగా లేవని, వచ్చే కొద్ది రోజుల్లో ఏ మాత్రం రికవరీ వచ్చినా అమ్మకాల ఒత్తిడి ఏర్పడుతుందని యాక్సిస్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ రాజేశ్ పాల్వియా అభిప్రాయం వ్యక్తం చేశారు. నిఫ్టీ 50 డీఎంఏ దిగువకు పడిపోయినందున, ట్రెండ్ నెగిటివ్గానే ఉంటుందని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ రూపక్ డే అంచనా వేశారు.
కీలక మద్దతు 19,500
ఈ వారం నిఫ్టీకి 19,500 స్థాయివద్దనున్న మద్దతు కీలకమైనదని, ఈ స్థాయిని కోల్పోతే తదుపరి రోజుల్లో 19,150-19,000 శ్రేణి వరకూ పతనమయ్యే అవకాశం ఉందని రూపక్ డే విశ్లేషించారు. 19,600-19,650 శ్రేణి వద్ద గట్టి నిరోధం ఉన్నదని, 19,650 స్థాయిపైకి చేరితే షార్ట్ కవరింగ్ ర్యాలీ జరుగుతుందని అంచనా వేశారు. భారీ పుట్ రైటింగ్ జరిగిన 19,500 ప్రధాన మద్దతు స్థాయిని వదులుకుంటే తాజా షార్ట్స్ క్రియేట్ అవుతాయని, 19,600 స్థాయి వద్ద కాల్ రైటింగ్ జోరుగా జరిగినందున ఈ స్థాయి సూచికి అవరోధం కల్పిస్తుందని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది తెలిపారు.