పెరుగుతున్న వైద్య ఖర్చులను అధిగమించేందుకు తమ ఖాతాదారుల కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) స్వస్థ్య పేరిట పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) ఓ పైలట్ ప్రాజెక్ట్ను తీసుకొచ్చింది. ఈ స్వచ్చంధ పథకం ద్వారా మీ పెన్షన్ ఖాతా పరిధిలోనే ప్రత్యేకంగా ఓ ఆరోగ్య సంరక్షణ నిధిని నిర్మించుకోవచ్చు. ఎన్పీఎస్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిధిలో నగదు మొత్తాల జమ ఉంటుంది.
దీనికి మార్కెట్ ఆధారిత వృద్ధిని చూడవచ్చు. అయితే ఒకవేళ ఈ పెట్టుబడులపై వచ్చే రాబడులు ఆశించిన స్థాయిలో ఉండకపోతే మీ నిధులను మళ్లీ మీ ప్రధాన ఎన్పీఎస్ ఖాతాలోకి ఎలాంటి నష్టం లేకుండా బదిలీ కూడా చేసుకోవచ్చు. ఇక రెగ్యులర్ ఎన్పీఎస్ ఖాతా కలిగిన భారత పౌరులు ఎవరైనా దీనికి అర్హులే. వైద్య అవసరాల కోసం ఎప్పుడైనా ఎలాంటి ఆంక్షలు లేకుండా నగదు ఉపసంహరణలు చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో నిబంధనలకు లోబడి 100 శాతం నగదును వెనుకకు తీసుకోవచ్చు. ఈ స్కీమ్లో కార్పస్ ఫండ్ రూ.50 వేలు దాటితేనే తొలి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.