Elon Musk-Twitter | ట్విట్టర్ యూజర్లకు ఆ సంస్థ చీఫ్ ఎలన్ మస్క్.. సరికొత్త అవకాశం కల్పించారు. ట్విట్టర్ యూజర్లు తాము పోస్ట్ చేసే కంటెంట్ నుంచి మనీ సంపాదనకు పర్మిషన్ ఇస్తున్నట్లు తెలిపారు. సుదీర్ఘమైన ఇన్ఫర్మేషన్తోపాటు ఎక్కువ నిడివి గల వీడియో వరకు దేనికైనా సబ్స్క్రిప్షన్ ఆప్షన్తో డబ్బు సంపాదించుకోవచ్చు అని అన్నారు. యూజర్లు తమ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్లి మానిటైజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలని పేర్కొన్నారు. ఇప్పటికైతే అమెరికాలో మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉందన్నారు. త్వరలో ఇతర దేశాలకూ విస్తరిస్తామని మస్క్ చెప్పారు. కంటెంట్ 280 పదాల నుంచి గరిష్టంగా 10 వేల వరకు ఉండొచ్చు.
కంటెంట్ ద్వారా యూజర్లు సంపాదించే డబ్బు నుంచి ఏడాది పాటు ట్విట్టర్ ఎటువంటి ఫీజు వసూలు చేయబోదన్నారు. సబ్స్క్రిప్షన్లతో వచ్చే డబ్బులో గరిష్టంగా 70 శాతం యూజర్లకే వస్తుందన్నారు. ట్విట్టర్ ద్వారా ఆర్జిస్తున్న మొత్తం ఆదాయం నుంని ఐఓఎస్, ఆండ్రాయిడ్ వర్షన్లను వాడుకున్నందుకు యాప్ స్టోర్ ఫీజు కింద 30 శాతం చెల్లించాలి. ఇక వెబ్లోనైతే 92 శాతం ఇన్కం వరకు యూజర్లకే చెందుతుందన్నారు. కంటెంట్ ప్రమోషన్కూ ట్విట్టర్ సహకరిస్తుందన్నారు. యూజర్ తమకు ఇష్టమైనప్పుడు తమ కంటెంట్తో సహా ట్విట్టర్ నుంచి వెళ్లిపోవచ్చునన్నారు.
తాజా మార్పులతో ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్లను ట్విట్టర్ ప్లాట్ఫామ్పైకి తేవాలని ఎలన్మస్క్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. యూజర్లు ట్విట్టర్ను వీడకుండా కాపాడుకునే వ్యూహమైనా కావచ్చునని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. తొలి ఏడాది పాటు ఏ ఫీజు వసూలు చేయకున్నా.. మున్ముందు మంచి ఇన్కం సోర్స్గా మారొచ్చునని అంచనా వేస్తున్నారు.
కంటెంట్ నుంచి మనీ ఆర్జించుకునే ఆప్షన్ యూజర్లకు ఇవ్వడం ద్వారా పేరొందిన న్యూస్లెటర్ కంపెనీ సబ్స్టాక్కు పోటీ ఇవ్వడం కూడా మస్క్ వ్యూహంలో భాగమై ఉండొచ్చునని టెక్ నిపుణులు భావిస్తున్నారు. సబ్ స్టాక్ కూడా తమ ప్లాట్ఫామ్పై యూజర్లు ఎటువంటి కంటెంట్తోనైనా సబ్స్క్రిప్షన్ ద్వారా అందించుకునే వీలు కల్పిస్తున్నది. ఇటీవలే నోట్స్ అనే పేరుతో పబ్లిక్ ఫీడ్ పోస్ట్ చేసుకునే అవకాశం ఇవ్వడంతో సబ్ స్టాక్ కూడా ట్విట్టర్లా మారిపోయింది. దీంతో సబ్స్టాక్ లింక్స్ ఉన్న ట్వీట్లు లైక్ చేయడం, రిప్లయ్ ఇవ్వడం, రీ ట్వీట్ చేయడం వంటి చర్యలు ట్విట్టర్ తాత్కాలికంగా నిలిపేసింది.