న్యూఢిల్లీ, ఆగస్టు 31: ఇకపై ఫీచర్ ఫోన్ వినియోగదారులూ యూపీఐని వినియోగించుకోనున్నారు. ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే.. సోమవారం ‘ఫోన్పే యూపీఐ 123పే’ సేవలను ప్రారంభించింది. దీనివల్ల ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే ఫీచర్ ఫోన్ యూజర్లకూ యూపీఐ లావాదేవీలను జరిపే వెసులుబాటు దక్కింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్లకుపైగానే ఫీచర్ ఫోన్ వినియోగదారులున్నట్టు అంచనా. అయితే స్మార్ట్ఫోన్ యూజర్లకున్నట్టు ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో వీరంతా యూపీఐ లావాదేవీలకు దూరమవుతున్నారు. కానీ ఇప్పుడు వీరు కూడా ఫోన్పే యూపీఐ 123పే ద్వారా ఇకపై యూపీఐ లావాదేవీలను జరుపుకోవచ్చని, ఈ తరహా సౌకర్యాన్ని అందిస్తున్న తొలి ప్రముఖ థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ) తామేనని ఫోన్పే ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
ఇప్పటికైతే నోకియా, హెచ్ఎండీ, లావా ఇంటర్నేషనల్, ఐటెల్ మొబైల్ కంపెనీలకు చెందిన ఫీచర్ ఫోన్ వినియోగదారులు మాత్రమే ఫోన్పే యూపీఐ 123పే సేవల్ని పొందవచ్చు. ఈ ఫోన్లలో ప్రీ-బండిల్డ్గా ఫోన్పే యూపీఐ 123పే ఉంటుంది. అయితే మరిన్ని మొబైల్ ఫోన్లలోనూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొనేలా ప్రయత్నిస్తున్నామని ఫోన్పే చెప్తున్నది. ఇదిలావుంటే కొత్తగా ఫీచర్ ఫోన్ కొనేవారికే ఈ ఫోన్పే యూపీఐ 123పే సేవలు అందుబాటులో ఉంటాయా? లేదా ఇప్పటికే సదరు ఫోన్లను వాడుతున్నవారూ పొందవచ్చా? అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. ఇక ఇదో ఎస్ఎంఎస్ ఆధారిత యూపీఐ నిర్మాణం. 2జీ కనెక్టివిటీ పరిమితంగా ఉన్న ప్రాంతాల్లోనూ పనిచేస్తుంది. మొబైల్ నెంబర్ లేదా యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్లను వినియోగించి పర్సన్-టు-పర్సన్, పర్సన్-టు-మర్చంట్ పేమెంట్స్నూ చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాలో ఎంత నగదు ఉన్నది? గతంలో జరిపిన లావాదేవీల చరిత్రనూ చూసుకోవచ్చు. మున్ముందు బిల్ పేమెంట్స్, మొబైల్ రీచార్జెస్, ఆధార్ ఆధారిత ఆన్బోర్డింగ్ సేవల్నీ తెస్తామని ఫోన్పే చెప్తున్నది.
ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఫోన్పే యూపీఐ 123పే సేవల్ని వినియోగించుకోవడానికి వీలుగా ఫోన్పే ఓ వాయిస్-ఫస్ట్, ఏఐ ఆధారిత హెల్ప్లైన్నూ ప్రారంభించింది. స్టెప్-బై-స్టెప్ గైడెన్స్ తీసుకోవచ్చని, యూపీఐ సంబంధిత ప్రశ్నలకూ సమాధానాలు పొందవచ్చని, ఇంగ్లిష్తోపాటు 12 స్థానిక భాషల్లోనూ యూజర్లు సాయం అందుకోవచ్చని ఫోన్పే తెలిపింది. కాగా, ఈ ఏడాది జూలైనాటికి ఫోన్పే వినియోగదారులు 71.5 కోట్లపైనే. అలాగే 5 కోట్లకుపైగా వ్యాపార భాగస్వాములున్నారని ఫోన్పే చెప్తున్నది.