Norway Wealth Fund | అమెరికా షార్ట్ షెల్లర్ కంపెనీ.. హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికతో చిక్కుల్లో పడ్డ అదానీ గ్రూప్కు గురువారం గట్టి షాక్ తగిలింది. నార్వే సావరిన వెల్త్ ఫండ్.. ఈ ఏడాది ప్రారంభం నుంచి మూడు అదానీ గ్రూప్ సంస్థల నుంచి మొత్తం వాటాలను విక్రయించినట్లు తెలిపింది. ఆ వాటాల విలువ 200 మిలియన్ల డాలర్లకు పైగా ఉంటుందని గురువారం పేర్కొన్నది. 2022 చివరి నాటికి అదానీ టోటల్ గ్యాస్ ,అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థల్లో వాటాలు ఉన్నాయని తెలిపింది. వాటిల్లో 200 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు విక్రయించినట్లు సంస్థ ఈఎస్జీ రిస్క్ మానిటరింగ్ హెడ్ క్రిస్టోఫర్ రైట్.. మీడియా సమావేశంలో వెల్లడించారు. 2022 చివరి నాటికి అదానీ టోటల్ గ్యాస్లో 83.6 మిలియన్ డాలర్లు, అదానీ పోర్ట్స్ 63.4 మిలియన్ డాలర్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ 52.7 మిలియన్ డాలర్ల మేరకు నార్వే వెల్త్ ఫండ్ పెట్టుబడులు ఉన్నాయి.
గతేడాది చివరి నుంచి అదానీ గ్రూప్ కంపెనీల్లో వాటాలు ఉపసంహరించాలని నిర్ణయించామన్నారు క్రిస్టోఫర్ రైట్. అదానీ గ్రూప్ సంస్థల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్ పతనం వల్ల తమ సంస్థకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని చెప్పారు. అదానీ గ్రూప్ సంస్థలతో ఈఎస్జీ సమస్యలు ఉన్నాయని కొన్నేండ్లుగా చెబుతున్నామని నార్వే వెల్త్ ఫండ్ తెలిపింది. ఈఎస్జీ సమస్యలంటే.. కార్పొరేట్ క్లైమేట్ పాలసీస్, ఇంధన వాడకం, వ్యర్థాలు, కాలుష్యం. ప్రకృతి వనరుల సంరక్షణ తదితర అంశాలపై అదానీ గ్రూప్కు రిస్క్ ఉందని చెబతున్నట్లు తెలిపింది.
అదానీ గ్రూప్ సంస్థలపై గత నెల 24న యూఎస్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక వెల్లడించినప్పటి నుంచి భారత్లోని ఏడు అదానీ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 110 బిలియన్ డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తున్నది. పన్ను స్వర్గధామాలుగా ఉన్న దేశాల్లోని చట్టాలను దుర్వినియోగం చేశారని, స్టాక్ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడ్డారని హిండెన్బర్గ్ ఆరోపించింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ నిరాకరించింది. తామే తప్పు చేయలేదని పేర్కొంది. నార్వే సెంట్రల్ బ్యాంక్ నిర్వహిస్తున్న సావరిన్ వెల్త్ ఫండ్ ఇది. ప్రపంచవ్యాప్తంగా 9,200 లిస్టెడ్ కంపెనీల్లో 1.3 శాతం వాటాలను కలిగి ఉంది. నార్వే వెల్త్ ఫండ్ విలువ 1.35 లక్షల కోట్ల డాలర్లు ఉంటుంది.