న్యూఢిల్లీ, జూలై 13: ద్రవ్యోల్బణ వాతావరణంలో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందన్న భయాల నేపథ్యంలో భారత్ ఆర్థిక వృద్ధి అంచనాలకు పలు అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు, బ్రోకరేజ్ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు కత్తెరవేస్తున్నాయి. ఈ క్రమంలో 2023 క్యాలండర్ సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి అంచనాల్ని 4.7 శాతానికి తగ్గిస్తున్నట్టు తాజాగా నోమురా ప్రకటించింది. ఈ వృద్ధి 5.4 శాతంగా గతంలో నోమురా అంచనా వేసింది. అధిక ద్రవ్యోల్బణం, ద్రవ్య విధాన కట్టడి, ప్రైవేట్ పెట్టుబడులు తగ్గడం, విద్యుత్ కొరత వంటి అంశాల కారణంగా వృద్ధి రేటు అంచనాల్ని 5.4 శాతం నుంచి 4.7 శాతానికి తగ్గిస్తున్నట్టు ఈ ఇన్వెస్ట్మెంట్ సంస్థ విశ్లేషకులు అరదీప్ నంది, సోనాల్ వర్మలు వివరించారు. రిజర్వ్బ్యాంక్ సహనస్థాయి కంటే అధికంగా 7 శాతం ఎగువన ద్రవ్యోల్బణం కొనసాగడంతో వృద్ధికి రిస్క్ ఏర్పడుతున్నదన్నారు. ద్రవ్యోల్బణం అదుపునకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, అధిక ముడి సరుకుల వ్యయాలు, విద్యుత్ టారీఫ్లు పెరగనుండటంతో ధరల సూచీ గరిష్ఠస్థాయిలోనే స్థిరపడుతున్నదని నోమురా తెలిపింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నిరోధించడానికి ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంక్లు వడ్డీ రేట్లను భారీగా పెంచుతాయని, ఇందుకోసం వృద్ధిని త్యాగం చేయడానికి కూడా వెనుకాడవని నోమురా పేర్కొంది. రిజర్వ్బ్యాంక్ జూన్ నెలలో రెపోరేటును 50 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. అంతకుముందు హఠాత్తుగా 40 బేసిస్ పాయింట్ల రెపో రేట్ను వడ్డించిన విషయం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో మాత్రమే భారత్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్య శ్రేణిలోకి వస్తుందని, పూర్తి ఆర్థిక సంవత్సరానికి రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6.6 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఒడిదుడుకులు, అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు తీరునుబట్టి ఆర్బీఐ ద్రవ్య విధాన చర్యలు ఉంటాయన్నది. ఆగస్టు పాలసీ సమీక్షలో రిజర్వ్బ్యాంక్ 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచవచ్చని, అటుతర్వాత రెండు సమావేశాల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున పెంపు ఉంటుందని, దాంతో రెపో రేటు 5.90 శాతానికి చేరుతుందని భావిస్తున్నట్టు నోమురా ప్రధాన ఆర్థికవేత్త రజని సిన్హా వివరించారు.