Bombay High Court | ప్రజా ప్రయోజన ప్రాజెక్టుల కోసం చేపట్టే భూముల సేకరణపై ముఖ్యమైన సంప్రదాయంగా నిలిపేందుకు మార్గం సుగమం అయ్యింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నిర్మించే బుల్లెట్ రైలు ప్రాజెక్టుపై బాంబే హైకోర్టు గురువారం సంచలన తీర్పు చెప్పింది. ఈ ప్రాజెక్టు కోసం నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) చేపట్టిన ఆస్తుల సేకరణలో బాధితులకు చెల్లించిన నష్ట పరిహారంపై ఆదాయం పన్ను (ఐటీ) విధించరాదని ఆదేశించింది.
సీమా పాటిల్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్లు ఎస్వీ గంగాపుర్వాలా, ఎంజీ సెవిలికర్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. తన భూమిని బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం సేకరించినందుకు తనకు ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ చెల్లించిన పరిహారంపై వసూలు చేసిన పన్ను వెనక్కు చెల్లించాలని కోరుతూ ఠాణె జిల్లా భీవండి ప్రాంత మహిళ సీమా పాటిల్ ఆ పిటిషన్ దాఖలు చేశారు.
బుల్లెట్ రైలు కోసం భూమి స్వాధీనంచేసుకున్న ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్.. భూ యజమాని (పిటిషనర్)కు చెల్లించిన పరిహారంలో ఆదాయం పన్ను వసూలు చేయరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. పరిహారంగా చెల్లించిన మొత్తంలో టీడీఎస్ కింద సొమ్ము డిడక్ట్ చేయొద్దని పేర్కొంది. ప్రైవేట్ సంప్రదింపుల ద్వారా ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ ఈ భూమిని స్వాధీనం చేసుకున్నందుకు భూ యజమానికి పరిహారంగా చెల్లిస్తున్న ఆదాయం అని గుర్తు చేసింది. కనుక సదరు పిటిషనర్ నుంచి వసూలు చేసిన ఆదాయం పన్ను తిరిగి చెల్లించాలని ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ను న్యాయస్థానం ఆదేశించింది.