Pay by Car | గతంలో డెబిట్ కార్డు.. క్యాష్ ఉంటేనే ఆర్థిక లావాదేవీలు నిర్వహించే వాళ్లం. కానీ డిజిటలైజేషన్ డెవలప్ అవుతున్నా కొద్దీ ఆర్థిక లావాదేవీల తీరుతెన్నులు పూర్తిగా మారిపోయాయి. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్.. తాజాగా మొబైల్ ఫోన్ యాప్స్ ఆధారిత యూపీఐ పేమెంట్స్ లోకి వచ్చేశాం. ఇంకా రోజురోజుకు మార్పులు వచ్చేస్తున్నాయి. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ స్వైపింగ్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ లేకుండా చెల్లింపులు చేసేయొచ్చు.
డెబిట్ కార్డుతో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్తోనే పేమెంట్స్ చేసేయొచ్చు. యూపీఐ మద్దతుతో ఈ కొత్త చెల్లింపుల వ్యవస్థ వచ్చింది. ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్, మాస్టర్ కార్డ్ సపోర్టెడ్ టోన్ ట్యాగ్ అనే సంస్థ కొత్తగా ‘పే బై కార్’ అనే సిస్టమ్ డెవలప్ చేసింది. ఎంజీ హెక్టార్ కారు, భారత్ పెట్రోలియం సంస్థ భాగస్వామ్యంతో ఈ చెల్లింపుల విధానాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈ సిస్టమ్ యూపీఐ పేమెంట్స్ సిస్టమ్ మద్దతుతో పని చేస్తుంది. కారులో ప్రయాణించేవారు పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ నింపుకున్నా, ఫాస్టాగ్ రీచార్జీ చేయాలన్నా కారు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో చెల్లింపులు జరిపేయొచ్చు.
మీరు కారుతో పెట్రోల్ బంకుకు వెళ్లినప్పుడు కారులోని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఫ్యూయల్ డిస్ పెన్సర్ నంబర్ డిస్ ప్లే చేస్తుంది. బంకులోకి రాగానే మీకు ప్రకటన వినిపించడంతోపాటు బంక్ సిబ్బందినీ అప్రమత్తం చేస్తుంది. ఇన్ఫోటైన్ మెంట్ సిస్టంలో ఎంత పెట్రోల్ అవసరమో నమోదు చేస్తే సరి.. దానికి బిల్లు ఎంతో కూడా ఇన్ఫోటైన్మెంట్ సిస్టం స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ బిల్లు చెల్లించిన తర్వాత మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ మొత్తం కనిపిస్తుంది. ఇటీవల జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్-2023 వాయిస్ ఆధారిత యూపీఐ పేమెంట్స్ ను కూడా టోన్ ట్యాగ్ ఆవిష్కరించింది.