న్యూఢిల్లీ, మార్చి 21: క్రిప్టోకరెన్సీలు లేదా ఇతర వర్చువల్ డిజిటల్ ఆస్తుల మైనింగ్ కోసం అయ్యే ఇన్ఫ్రా వ్యయాలపై ఆదాయపు పన్ను మినహాయింపులు ఉండబోవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు తెలిపారు. క్రిప్టో కరెన్సీలపై వచ్చే ఆదాయంపై 30 శాతం పన్నును బడ్జెట్లో ప్రతిపాదించినది తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్చువల్ డిజిటల్ ఆస్తులపై ప్రభుత్వం త్వరలో నిర్వచనాన్ని తెస్తుందనిన్నారు.
ఆర్బీఐ నుంచి ప్రతిపాదనలు రాలేదు
క్రిప్టో ఆస్తుల ట్రేడింగ్కు సంబంధించిన యంత్రాంగంపై రిజర్వ్బ్యాంక్ నుంచి ప్రతిపాదనలు ఏవీ ఇంకా అందలేదని పంకజ్ చౌదరి తెలిపారు. ఒక లిఖితపూర్వక ప్రశ్నకు మంత్రి బదులిస్తూ క్రిప్టో సంబంధిత భాగస్వామ్య వర్గాలతో చర్చించి, అన్ని అంశాలనూ పరిశీలించిన తర్వాత క్రిప్టోకరెన్సీ రంగంపై జాగ్రత్తగా విధి విధానాల్ని ఖరారు చేస్తామన్నారు. క్రిప్టోలకు చట్టబద్దత లేదంటూ రిజర్వ్బ్యాంక్ సీనియర్ అధికారులు పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్నప్పటికీ, క్రిప్టో ఆస్తుల ఆదాయంపై కేంద్ర బడ్జెట్లో 30 శాతం పన్ను, 1 శాతం టీడీఎస్ ప్రతిపాదించారు. కానీ పన్ను ఎలా విధించాలన్న అంశంపై ప్రభుత్వం ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు.