హైదరాబాద్, ఫిబ్రవరి 8: దేశంలో అతిపెద్ద ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ మరోమారు మధ్యంతర డివిడెండ్ను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5.73 (573 శాతం) మధ్యంతర డివిడెండ్ను ప్రతిపాదించింది. ఈ ఏడాది ప్రకటించడం ఇది రెండోసారి. గతంలో రూ.9.01 డివిడెండ్ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఒక్కో షేరుకు రూ.14.74 డివిడెండ్ చెల్లించినట్లు అయింది.
క్యూ3లో రూ.2,048 కోట్ల లాభం
నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది సంస్థ. నిర్వహణ ఖర్చులు అధికమవడంతో గత త్రైమాసికానికిగాను కన్సాలిడేటెడ్ నికర లాభం 2.8 శాతం తగ్గి రూ.2,048.40 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.2,108.05 కోట్ల లాభాన్ని గడించింది. కానీ, కంపెనీ ఆదాయం రూ.4,460.97 కోట్ల నుంచి రూ.6,026.68 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. నిర్వహణ ఖర్చులు రూ.1,650.56 కోట్ల నుంచి రెండు రెట్లు పెరిగి రూ.3,332.44 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఈ ఏడాది నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యానికి చేరుకుంటాం..వ్యాపార విస్తరణకోసం పెట్టుబడుల ప్రక్రియ కొనసాగుతున్నదని కంపెనీ సీఎండీ సుమిత్ దేబ్ తెలిపారు. ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో రూ.19,179 కోట్ల ఆదాయంపై రూ.7,583 కోట్ల నికర లాభాన్ని గడించింది. అలాగే 10.65 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన సంస్థ 9.85 మిలియన్ టన్నుల విక్రయాలు జరిపింది.