హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): దేశంలో మునుపెన్నడూ లేనంతగా మైనింగ్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమావేశంలో ఎన్ఎండీసీ సీఎండీ సుమిత్ దేవ్ అన్నారు. శనివారం హైదరాబాద్లోని ఎన్ఎండీసీ సమావేశ మందిరంలో జరిగిన అసోసియేషన్ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు.
మైనింగ్ పరిశ్రమలో అనేక ఆధునిక పద్ధతులు వచ్చాయని, కృత్రిమ మేధస్సు, ఐటీల వినియోగం గణనీయంగా పెరిగిందని తెలిపారు. లీజు, కేటాయింపులు తదితర అంశాల్లో కొత్త విధానాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు. కాగా, జాతీయ స్థాయిలో మైనింగ్ పరిశ్రమ తీరుతెన్నులు-సవాళ్లు-లక్ష్యాలపై వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న సదస్సు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఇదిలావుంటే ఫస్ట్ ఎయిడ్ టెస్టింగ్ సెంటర్ను మైనింగ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అనుబంధంగా నిర్వహించడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు.