Nitin Gadkari | న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఇథనాల్ ఆధారిత వాహనాల వినియోగంతో ఎన్నో ప్రయోజనాలున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ క్రమంలోనే ఇథనాల్ను వాడుకొంటే 25 రూపాయలకే లీటర్ పెట్రోల్ను పొందవచ్చని చెప్పారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో గరిష్ఠంగా లీటర్ పెట్రోల్ రూ.120 పలుకుతున్నదన్న ఆయన.. 60 శాతం విద్యు త్తు, 40 శాతం బయో-ఇథనాల్ మిశ్రమంతో ఇంధన ఖర్చును పెద్ద ఎత్తున తగ్గించుకోవచ్చని తెలిపారు.
ఇథనాల్ వాడకంతో రైతులకు కూడా భారీ ప్రయోజనం చేకూరుతుందని, ముడి చమురు దిగుమతుల కోసం ఏటా ఖర్చు చేసే లక్షల కోట్ల రూపాయలనూ మిగుల్చుకోవచ్చని వివరించారు. కాలుష్యం కూడా బాగా తగ్గుతుందని పేర్కొన్నారు. కాగా, ఇథనాల్ ఓ పునరుత్పాదక ఇంధనం. రకరకాల మొక్కల నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తారు. వివిధ మిశ్రమాలతో కలిపి వాహన ఇంధనంగా దీన్ని ఉపయోగించవచ్చు. దేశీయ ఆటో రంగ కంపెనీలు ఇథనాల్ ఆధారిత వాహనాలను ఉత్పత్తి చేసే దిశగా అడుగులు వేయాలని మంత్రి కోరుతున్నారు. అయితే మూడున్నర నెలల క్రితం ఈ ఏడాది జూలైలోనూ గడ్కరీ.. ఇథనాల్ ప్రయోజనాలను చెప్పగా, అప్పుడు లీటర్ రూ.15కే పెట్రోల్ను పొందవచ్చనడం గమనార్హం.