న్యూఢిల్లీ : ధరల మంట, పన్ను పోట్ల నుంచి ఉపశమనం కోసం మధ్యతరగతి ప్రజలు కేంద్ర బడ్జెట్ 2023వైపు ఆశగా చూస్తుండగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యతరగతిపై కేంద్ర బడ్జెట్ ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశాలపై పలు సంకేతాలు పంపారు. తాను మధ్యతరగతి వర్గానికి చెందిన వ్యక్తినని, వారి బాధలు, ఒత్తిళ్లు తనకు తెలుసునని వ్యాఖ్యానించారు.
ఓవైపు అధిక ధరలతో పేదవర్గాలతో పాటు మధ్యతరగతి కుదేలవుతుంటే తాము ఇప్పటివరకూ ఏ బడ్జెట్లోనూ మధ్యతరగతిపై పన్ను వేయలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి చెప్పుకొచ్చారు. ఉపాధి కోసం పెద్దసంఖ్యలో మధ్యతరగతి వర్గాల ప్రజలు నగరాలకు వలస బాట పడుతున్నదున తాము స్మార్ట్ సిటీల అభివృద్ధిపై దృష్టి సారించామని చెప్పారు.
మధ్యతరగతి మేలు కోసం తాము పనిచేయడం కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతుండగా మధ్యతరగతి ప్రజలు బడ్జెట్పై భారీ అంచనాలతో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే చివరి పూర్తిస్ధాయి బడ్జెట్ కావడంతో పన్ను మినహాయింపులు, ఆరోగ్య, ఉపాధి రంగాల్లో ఊరట కల్పించే చర్యలను కేంద్రం ప్రకటించాలని వారు కోరుతున్నారు. గత బడ్జెట్లలో మధ్యతరగతిని విస్మరించిన నిర్మలా సీతారామన్ ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్ధాయి బడ్జెట్లో ఏమాత్రం ఆసరాగా నిలుస్తారనేది వేచిచూడాలి.