న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: జాతీయ నగదీకరణ పైప్లైన్ (ఎన్ఎంపీ)లో భాగంగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 96,000 కోట్ల విలువైన ఆస్తుల విక్రయాల్ని పూర్తిచేసిందని కేంద్ర ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఎంపీ ద్వారా రూ. 88,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా, అంతకుమించిన విలువగల విక్రయ లావాదేవీల్ని పూర్తిచేసినట్టు ఆ అధికారి వెల్లడించారు. ఎన్ఎంపీ అమలుపై మంగళవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..నీతి ఆయోగ్ సీఈవో, ఆర్థిక శాఖతో పాటు వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశమై ఎన్ఎంపీ అమలుతీరును సమీక్షించారు. రోడ్లు, విద్యుత్, బొగ్గు, మైనింగ్ ఆస్తుల విక్రయం ద్వారా ఎంఎన్పీ తొలి ఏడాది లక్ష్యాన్ని సాధించామని ప్రభుత్వాధికారి చెప్పారు. వివిధ రంగాలకు చెందిన మౌలిక ఆస్తుల్ని విక్రయించి నాలుగేండ్లలో రూ.6 లక్షల కోట్లు సమీకరించేందుకు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఈ ఎంఎన్పీని ప్రకటించింది.
వివిధ శాఖలకు లక్ష్యాల్ని నిర్దేశించింది. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రవాణా, రహదారుల శాఖ రూ. 23,000 కోట్ల ఆస్తుల్ని విక్రయించగా, విద్యుత్ శాఖ రూ.9,500 కోట్లు సమీకరించిందని ఆ అధికారి సమావేశపు వివరాల్ని తెలిపారు. నగదీకరణ కార్యక్రమంలో లక్ష్యాల్ని పూర్తిచేయని శాఖల్ని..తదుపరి సంవత్సరాల్లో త్వరితంగా విక్రయమయ్యే ఆస్తుల్ని గుర్తించమని సమావేశంలో కోరినట్టు ఆయన తెలిపారు. అలాగే ఆర్థిక మంత్రి జరిపిన సమీక్షా సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రంగాలవారీగా లక్ష్యాల్ని నిర్దేశించారు. ప్రస్తుత ఏడాది మొత్తం రూ.1.62 లక్షల కోట్లు సమీకరించాలన్న లక్ష్యాన్ని నిర్ణయించారు. ఈ లక్ష్య సాధనకు మంత్రిత్వ శాఖలన్నీ పూర్తిగా, వ్యక్తిగత స్థాయిలో కృషిచేయాలంటూ నిర్మలా సీతారామన్ కోరారు.