అనంతపురం: జిల్లా పరిధిలోని పాలసముద్రం గ్రామంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్) భూమి పూజలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. 500 ఎకరాల విస్తీర్ణంలో ఈ సంస్థను నెలకొల్పుతున్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం రూ.730 కోట్లు కేటాయించారు. మధ్యాహ్నం బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. అక్కడి నుంచి అనంతపురం జిల్లాకు రోడ్డు మార్గాన చేరుకున్నారు. అనంతరం నాసిన్ భూమి పూజలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన్న, ఆర్అండ్బీ మంత్రి ఎం శంకరనారాయణ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కేంద్ర ఆర్థిక మంత్రి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. ఆహ్వానపత్రంలో తన పేరు లేదని ఎంపీ గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేయగా.. మరో ఎంపీ తలారీ రంగయ్య ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందలేదని హాజరుకాలేదు.
ఈ సంస్థలో ఐఆర్ఎస్కు ఎంపికైన ప్రొబెషనరీ అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఈ ప్రాజెక్టుకు రెండోసారి భూమి పూజ జరుగుతున్నది. 2015 ఏప్రిల్లో ఏపీ సీఎంగా చంద్రబాబు హయాంలో తొలిసారి అప్పటి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ భూమి పూజ చేశారు. ఏడేండ్ల తర్వాత మళ్ళీ ఇదే సంస్థకు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ భూమి పూజ చేయడం విశేషం.