Budget 2022 | వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించేందుకు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్లో ఏయే వర్గాలపై ఆదరణ చూపుతారు.. ఏయే రంగాలపై పన్నులు, సర్ చార్జీలు విధిస్తారు. వేతన జీవులను ఎలా కరుణిస్తారు.. అన్నదాతలకు ఎలా ఆదరువు చూపుతారు.. అన్న విషయాల సంగతి పక్కన బెడితే.. మన దేశ వార్షిక బడ్జెట్కు కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. తొలి నుంచి ఆర్థిక మంత్రులు సూట్కేసులో బడ్జెట్ ప్రతులను పార్లమెంట్కు తేవడం సంప్రదాయంగా కనిపిస్తున్నది. కాలక్రమంలో ఆయా సూట్కేసులు, వాటి రంగు, పరిమాణంలోనూ మార్పులొచ్చాయి. కానీ నరేంద్రమోదీ సర్కార్ 2019లో రెండోసారి అధికారంలోకి వచ్చాక పూర్తిగా సంప్రదాయమే మారిపోయింది. నరేంద్రమోదీ సర్కార్ 2.0లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్.. సూట్ కేసు సంప్రదాయానికి పూర్తిగా చెక్ పెట్టారు. అసలు ఆ సూట్కేసులో బడ్జెట్ ప్రతులు తేవడం ఏమిటి.. ఎవరెలా వ్యవహరించారు తెలుసుకుందామా.. !
భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముఖం శెట్టి 1947లో లెదర్ బ్యాగ్ వినియోగించారు. 1956-58, 1964-66 ఆర్థిక సంవత్సరాల్లో నాటి ఆర్థిక మంత్రి టీటీ కృష్ణమాచారి ఫైల్ బ్యాగ్లో బడ్జెట్ ప్రతులతో పార్లమెంటులో అడుగుపెట్టారు. 1958-59 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నలుపు రంగు బ్రీఫ్కేస్తో బడ్జెట్ ప్రతులను పార్లమెంట్కు తెచ్చారు. 1998-99లో నాటి వాజపేయి సర్కార్లో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ఎరుపు రంగుకు దగ్గరగా ఉన్న బడ్జెట్ బాక్స్లో బడ్జెట్ ప్రతులతో పార్లమెంట్కు వచ్చారు.
దేశానికి సంస్కరణలను పరిచయం చేసి ఆర్థిక వ్యవస్థకు మార్గనిర్దేశం చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1991-96 మధ్య పీవీ నర్సింహారావు క్యాబినెట్లో ఆర్థిక మంత్రిగా పని చేశారు. 1991-92లో తొలిసారి బ్రిటన్ తొలి ఆర్థిక మంత్రి విలియం ఎవర్ట్ గ్లాడ్స్టోన్ వినియోగించిన బ్రీఫ్కేస్ను పోలిన నలుపు రంగు బ్యాగ్ వాడారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందరిలా కాక చెర్రీ ఎరుపు రంగు సూట్కేసులో బడ్జెట్ పత్రాలను పార్లమెంటుకు తచ్చి ప్రత్యేకంగా నిలిచారు. ఇక మరో ఆర్థిక మంత్రి పీ చిదంబరం.. బ్రిటన్ మాజీ ప్రధాని గ్లాడ్స్టోన్ తరహాలో సాదా గోధుమ రంగు, ముదురు గోధుమ రంగు బ్రీఫ్కేసుల్ని వినియోగించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో తొలివిడుత ఎన్డీఏ సర్కార్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ జైట్లీ తొలి రెండేండ్లు గోధుమ రంగు, లేత గోధుమ రంగు బ్యాగ్లు వాడారు. 2017లో ముదురు గోధుమ రంగు బ్యాగ్ వాడారు. అనారోగ్యంతో బాధపడుతూ జైట్లీ చికిత్స కోసం అమెరికా వెళ్లడంతో 2019 ఎన్నికల ముందు ఆర్థిక మంత్రి హోదాలో పీయూష్ గోయల్ ఎరుపు రంగు సూట్కేసుతో పార్లమెంట్లోకి అడుగుపెట్టారు.
గతేడాది ఎన్డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక జులై 5న బడ్జెట్ సమయంలో సూట్కేసుతో పార్లమెంటుకు వచ్చే సంప్రదాయానికి చెక్ పెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆర్ధిక శాఖ ప్రముఖులతో కలిసి ఎర్రటి వస్త్రంలో బడ్జెట్ పత్రాలు తెచ్చారు. నాటి నుంచి నిర్మలా సీతారామన్ ఎర్రని వస్తంలోనే బడ్జెట్ ప్రతులను పార్లమెంట్కు తీసుకొస్తున్నారు.