ముంబై, ఆగస్టు 30: స్టాక్ మార్కెట్లు లాభాలతో కళకళలాడాయి. బ్యాంకింగ్, ఐటీ, చమురు రంగాలకు చెందిన షేర్లకు లభించిన మద్దతుతో సూచీలు ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను దేశ జీడీపీ గణాంకాలు బుధవారం విడుదలకానుండటంతో మదుపరుల్లో ఎనలేని ఉత్సాహం నింపింది. క్యూ1లో జీడీపీ 15 శాతం స్థాయిలో ఉంటుందని అంచనాలు వెలువడటం మార్కెట్లో ఉత్సాహాన్ని నింపింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడైనప్పటికీ దేశీయ సూచీలు మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోవడం విశేషం. ఇంట్రాడేలో 1,627 పాయింట్లు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ చివరకు 1,564.45 పాయింట్లు(2.70 శాతం) అందుకొని 59 వేల పాయింట్ల పైకి చేరుకున్నది. చివరకు 59,437.07 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 446.40 పాయింట్లు(2.58 శాతం) అందుకొని 17,759.30 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది మే 20 తర్వాత సూచీలు ఇంతటి స్థాయిలో లాభపడటం ఇది మొదటిసారి. స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడటం మదుపరుల సంపద అమాంతం పెరిగింది. బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.5,68,305.56 కోట్లు పెరిగి రూ.2,80,24,621.83 కోట్ల వద్ద నిలిచింది.
బజాజ్ ఫిన్సర్వ్ షేరు ధర 5 శాతానికి పైగా పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. బజాజ్ ఫైనాన్స్ షేరు 4.86 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 4.38 శాతం, టెక్ మహీంద్రా 3.96 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 3.72 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంక్ 3.46 శాతం, టాటా స్టీల్ 3.29 శాతం, హెచ్డీఎఫ్సీ 3.28 శాతం చొప్పున పెరిగాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, మారుతి, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, ఐటీసీ, ఎల్అండ్టీ, ఇన్ఫోసిస్ల షేర్లు రెండు శాతానికి పైగా అధికమయ్యాయి.
సన్ఫార్మా, ఎన్టీపీసీ, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్టెల్లు లాభాల్లో ముగిశాయి.
రంగాలవారీగా చూస్తే రియాల్టీ 3.51 శాతం, బ్యాంకింగ్ 3.33 శాతం, ఫైనాన్స్ 3.18 శాతం, యుటిలిటీ 2.82 శాతం, పవర్ 2.82 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 2.65 శాతం చొప్పున పెరిగాయి.