అమెరికాలో ఇటీవల వెలువడిన గణాంకాలు.. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుంటుందున్న అనుమానాల్ని కలిగించడంతో గతవారం డాలర్ ఇండెక్స్ పతనం కావడం, బంగారం భారీగా పెరగడం జరిగింది. డాలరు క్షీణించడం, రూపాయి బలపడటం, వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియకు రిజర్వ్బ్యాంక్ బ్రేక్ వేయడంతో భారత్ స్టాక్ మార్కెట్ ర్యాలీ జరిపింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 239 పాయింట్ల మేర పెరిగి 17,599 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే పలు ప్రపంచ మార్కెట్లకు సెలవు రోజైన గుడ్ఫ్రైడేనాడు అమెరికాలో పటిష్టమైన జాబ్స్ డాటా వెలువడటంతో ఈ వారం డాలర్ పుంజుకుంటుందన్న అంచనాల్ని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ ర్యాలీ కొనసాగింపుపై జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ సందేహం వ్యక్తం చేశారు. కానీ కీలకమైన 200 డీఎంఏను నిఫ్టీ ఛేదించినందున, మరికొంత అప్ట్రెండ్ ఉంటుందని అంచనా వేశారు.
17,700-17,800 వరకూ ఛాన్స్
ఈ వారం నిఫ్టీ కనీసం 17,700 పాయింట్ల వరకూ పెరగవచ్చని ఆనంద్ జేమ్స్ చెప్పారు. 17,470-17,370 మద్దతు శ్రేణిని నిలుపుకుంటే 17,800 పాయింట్ల లక్ష్యాన్ని చేరవచ్చన్నారు. నిఫ్టీ అవలీలగా 17,500 అవరోధస్థాయిని అధిగమించినందున, ఈ వారం 17,750-17,800 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ రీసెర్చ్ హెడ్ రాజేష్ పాల్వియా అంచనా వేశారు. 17,450 వద్ద మద్దతు పొందవచ్చన్నారు. 17,300-17,250 శ్రేణిని కోల్పోతే మార్కెట్ బేరిష్గా మారుతుందని, 17,800 పాయింట్ల స్థాయి నిరోధాన్ని కల్పించవచ్చని సామ్కో వెంచర్స్ సీఈవో జిమిత్ మోది విశ్లేషించారు.