TCS on Abroad Education | మీ పిల్లలు విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నరా.. మీ పిల్లల విద్య అవసరాలు, ఇతర ఖర్చుల కోసం మీరు డబ్బు పంపుతున్నారా..! ఇక నుంచి మీరు మీ పిల్లలకు పంపే మనీపై కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ కన్నేసింది.. అలా పంపే డబ్బు పైనా పన్ను వసూలు చేయ సంకల్పించింది. ఇప్పటివరకు దేశీయంగా ఏ లావాదేవీ జరిపినా, ఏ వస్తువు కొన్నా.. అమ్మినా పన్ను చెల్లించాల్సిందే. ముడి చమురు ధర తగ్గినా.. దేశీయంగా ఎక్సైజ్ సుంకాలు పెంచేసి.. వాహనదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసింది కేంద్రం. పలు వస్తు, సేవలపై జీఎస్టీ తడిసిమోపెడవుతున్నది. ఇప్పుడు విదేశాల్లో చదువుకునే తమ పిల్లలకు తల్లిదండ్రులు పంపే మనీపైనా కేంద్రం దృష్టి సారించింది. అలా పంపే సొమ్ములకు టీసీఎస్ పేరిట పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నది.
సరళీకృత చెల్లింపుల పథకం (liberalised remittance scheme – LRS) కింద విదేశాల్లోని తమ పిల్లల అవసరాలకు తల్లిదండ్రులు చెల్లించే మొత్తాలపై టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్ (టీసీఎస్) కింద ఐదు శాతం నుంచి 20 శాతం పన్ను పెంచుతూ 2023-24 బడ్జెట్ ప్రతిపాదనల్లో చేర్చారు. విదేశీ పర్యటనలకు, విదేశాల్లో పెట్టుబడులకు, విదేశాలకు మనీ పంపినా ఎల్ఆర్ఎస్ కింద టీసీఎస్ వసూళ్లు వర్తిస్తాయి. టీసీఎస్ నుంచి విద్య, ఆరోగ్య అంశాలకు మాత్రం మినహాయింపు ఉంది. విదేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్న వారి రోజువారీ ఖర్చులకు తల్లిదండ్రులు పంపే మనీ.. వారి విద్యాఫీజు సంబంధిత ఖర్చులకు కిందకు రావు. అలా పంపే సొమ్ముకు అధిక టీసీఎస్ వర్తిస్తుంది.
విదేశీ విద్యాభ్యాసం కోసం బ్యాంకు రుణాల ద్వారా పేమెంట్స్ జరుగుతాయి. ఇలా చేసే చెల్లింపులు రూ.7 లక్షలు దాటితే 0.5 శాతం టీసీఎస్ వర్తిస్తుంది. ఇందులో ఎటువంటి మార్పులు, చేర్పులు లేవు. విద్యారుణం ద్వారా కాకుండా ఇతర మార్గాల్లో (విద్యావసరాలకు) రూ.7 లక్షలకు పైగా పంపితే మాత్రం ఐదు శాతం టీసీఎస్ వర్తిస్తుంది. పిల్లల ఇతర ఖర్చులకు తల్లిదండ్రులు పంపే సొమ్ముపై 20 శాతం టీసీఎస్ పే చేయాల్సి ఉంటుంది. రూ.7 లక్షల్లోపు వరకు ఎటువంటి టీసీఎస్ వసూలు చేయరు.
తమ పిల్లల విద్య సంబంధ అవసరాల కోసం పంపినట్లు తల్లిదండ్రులు ఆధారాలు చూపాలి. ఆధారాలు చూపితే ఐదు శాతం, అలా కాకుండా రోజువారీ జీవన ఖర్చులకు పంపితే మాత్రం 20 శాతం టీసీఎస్ పే చేయాల్సి ఉంటుంది. పిల్లల హాస్టల్ ఖర్చుల కోసం లేదా ట్యూషన్ ఫీజు చెల్లించడం కోసం పంపారా? అన్న సంగతి తేలిగ్గా తెలిసిపోతుంది.
విదేశాల్లోని పిల్లలకు డబ్బు పంపేవారు బ్యాంకుకు వెళ్లి ఏ-2 ఫామ్ నింపి, ఏ అవసరాలకు చెల్లిస్తున్నారో స్పష్టంగా పేర్కొని, డిక్లరేషన్ ఫామ్పై సంతకం చేయాలని ఎల్ఆర్ఎస్ విధానం చెబుతుంది. అప్పుడు మీ బ్యాంకు ఖాతా నుంచి విదేశాల్లోని మీ పిల్లల ఖాతాకు డబ్బు వెళుతుంది. పిల్లల విద్యావసరాలకు కాదని తేలితే మాత్రం ఇతర అవసరాల కిందకు ట్రాన్స్ఫర్ చేయడంతోపాటు 20 శాతం టీసీఎస్ వసూలు చేస్తారు. అలా వసూలు చేసిన టీసీఎస్.. సంబంధిత వ్యక్తి ఐటీ రిటర్న్స్లో సర్దుబాటు చేస్తారు.
ఉదాహరణకు ఒక పన్ను చెల్లింపుదారు రూ.10 వేలు చెల్లించారనుకుందాం.. 20 శాతం టీసీఎస్ కింద రూ.2000కి వర్తిస్తుంది. మొత్తం ఆదాయంపై పన్ను రూ.5000 అనుకుంటే రూ.3000 చెల్లించొచ్చు. మిగతా రూ.2,000లను టీసీఎస్ బ్యాలెన్స్తో సర్దుబాటు చేస్తారు. పన్ను చెల్లింపులో సర్దుబాటు చేసినా.. ఎల్ఆర్ఎస్ కింద ఐదు శాతం నుంచి 20 శాతానికి టీసీఎస్ పెంచడం వల్ల నగదు లావాదేవీలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు నిపుణులు.