ChatGPT | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్జీపీటీ సక్సెస్ కావడంతో .. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత చాట్బోట్లు వాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. యూజర్ల ప్రశ్నలకు ఏఐ చాట్ బోట్లు ఖచ్చితమైన జవాబులు ఇస్తూ ఉండటంతో వీటి వినియోగంపై ఆసక్తి పెరిగింది. యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ప్రతి రూపంతో సంభాషిస్తున్నారు. ఇదిలా ఉంటే చాట్ జీపీటీ తరహా ఏఐ టెక్నాలజీతో మున్ముందు మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, ఈ టెక్నాలజీని డెవలప్ చేస్తున్న సంస్థలు, యూజర్లు ఈ హెచ్చరికలు, ఆందోళనను కొట్టి పారేస్తున్నారు. ఇదిలా ఉండగా, చాట్జీపీటీపై కూడా సైబర్ దాడి జరిగిందని సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న సైబర్ సెక్యూరిటీ సంస్థ గ్రూప్-ఐబీ వెల్లడించింది.
లక్ష మందికి పైగా చాట్ జీపీటీ యూజర్ల డేటా.. హ్యాకర్ల చేతికి చిక్కిందని గ్రూప్-ఐబీ పేర్కొంది. ఈ సైబర్ దాడి చేయడానికి హ్యాకర్లు ఇన్ఫో-స్టీలింగ్ (info-stealing malware) మాల్వేర్ వాడారని గ్రూప్-ఐబీ వివరించింది. హ్యాకర్ల వద్ద ఆసియా-పసిఫిక్ ప్రాంత యూజర్ల డేటా ఎక్కువగా ఉందని గ్రూప్-ఐబీ తన బ్లాగ్లో వెల్లడించింది. భారత్ తోపాటు పాకిస్థాన్, బ్రెజిల్, వియత్నాం, ఈజిప్ట్ దేశాల యూజర్ల డేటా హ్యాకర్లకు చిక్కింది. దాదాపు 40.5 శాతం యూజర్లు ఆసియా-పసిఫిక్ రీజియన్ ప్రాంత యూజర్లే. భారత్ నుంచి 12,632 మంది యూజర్ల డేటా తస్కరణకు గురైంది. 9217 మంది పాకిస్థానీయుల డేటాను హ్యాకర్లు కొట్టేశారు.
మాల్వేర్ సాయంతో 1,01,134 మంది యూజర్ల బ్రౌజింగ్ డేటా, బ్యాంకు కార్డుల డిటైల్స్, క్రిప్టో వాలెట్ డేటా, బ్రౌజింగ్ హిస్టరీ సేకరించారని పేర్కొంది. అంతే కాదు.. హ్యాకర్లు తమకు చిక్కిన డేటా డార్క్ వెబ్లోనూ అమ్మకానికి పెట్టారని కూడా ఐబీ గ్రూప్ స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో చాట్జీపీటీ యూజర్లు తమ అకౌంట్స్ పాస్ వర్డ్స్ అంటే జీ-మెయిల్, ఫేస్ బుక్ తదితర వేదికల మెయిల్ అకౌంట్స్ పాస్ వర్డ్స్ రీ సెట్ చేసుకోవాలని, టూ-ఫ్యాక్టర్ అథంటికేషన్ (2FA-two-factor authentication) ఎనేబుల్ చేసుకోవాలని సైబర్ ప్రొఫెషనల్స్ సూచిస్తున్నారు. బ్రౌజర్లలో అనధికారిక లింక్లను క్లిక్ చేసిన యూజర్ల డేటాను మాల్వేర్ ద్వారా హ్యాకర్లు తస్కరించినట్లు సమాచారం. దీనిపై చాట్ జీపీటీ పేరెంట్ సంస్థ ఓపెన్ ఏఐ రియాక్ట్ కావాల్సి ఉంది.