EV Car Battery | పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు.. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లు, కార్లలో కీలకం బ్యాటరీ.. అలాంటి బ్యాటరీ కారును 26 ఏండ్ల క్రితం 1996 సెప్టెంబర్ ఐదో తేదీన తొలిసారి పరీక్షించారు. కానీ, రెండున్నర దశాబ్దాల తర్వాత కూడా అగ్రరాజ్యం అమెరికా వంటి దేశాల్లోనూ బ్యాటరీతో నడిచే కార్లు కేవలం రెండు శాతమే. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో వాడుతున్న బ్యాటరీ తయారీ ఖర్చుతో కూడుకున్నది.. చెప్పుకోదగిన స్థాయిలో పని చేయకపోవడమే దీనికి కారణం. బ్యాటరీల తయారీలో లిక్విడ్ వాడకానికి బదులు ఎలక్ట్రోలైట్ ఘన పదార్థాల వినియోగంతో సమస్య పరిష్కారం అవుతుంది. ఖర్చు కూడా తక్కువ. అలా ఎలక్ట్రోలైట్ ఘన పదార్థాలతో తయారైన బ్యాటరీ కేవలం 15 నిమిషాల్లో చార్జింగ్ అవడమే కాదు.. 1000 కి.మీ. దూరం ప్రయాణిస్తుందని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ప్రీకోర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ డైరెక్టర్ ప్రొఫెసర్ రితేశ్ శుక్లా చెప్పారు.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న భారమైన బ్యాటరీల కంటే న్యూ బ్యాటరీలు ఆరు రెట్లు శక్తిమంతంగా ఉంటాయి. కానీ వీటిని తయారు చేయడంలో జాప్యానికి ఆయా ఎలక్ట్రోలైట్ ఘన పదార్థాల్లో పగుళ్ల (dendrite) తో సమస్య తలెత్తుతున్నది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి కసరత్తు చేస్తున్నారు.
ఎలక్ట్రోలైట్ ఘన పదార్థాలతో బ్యాటరీలను తయారు చేయడానికి ఖతార్ ప్రభుత్వ రంగ సంస్థ.. అమెరికా కంపెనీ క్వాంటంస్కేప్లో రూ.3000 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీ సీఈవో భారత సంతతికి చెందిన జగ్దీప్ సింగ్. అన్నీ సక్రమంగా జరిగితే క్వాంటమ్స్కేప్ బ్యాటరీ 17 శాతం చౌక కూడా. ఇది కూడా ప్రస్తుత భారీ బ్యాటరీల కంటే ఆరు రెట్లు శక్తిమంతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
క్వాంటమ్స్కేప్ కంపెనీలో పొర్చే కంపెనీ అత్యధికంగా 20 శాతం వాటా కలిగి ఉంది. ఫోక్స్ వ్యాగన్ కంపెనీలో పొర్చేకు 50.7 శాతం వాటాలు ఉన్నాయి. గత జనవరిలో కంపెనీ తొలి టెస్ట్ రిపోర్ట్ వెలుగు చూసింది. ఘన పదార్థాలతో కూడిన బ్యాటరీ కేవలం 15 నిమిషాల్లోనే 80 శాతం వరకు చార్జి అవుతుంది. 80 శాతం చార్జయిన బ్యాటరీ 1000 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ బ్యాటరీ టెస్టింగ్ మూడు దశల్లో పూర్తవుతుందని భావిస్తున్నారు. అంతా అనుకున్న మేరకు జరిగితే ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉన్నట్లే, 2025 నాటికి ఈవీ కార్లు అందరి వద్ద ఉండటం కామన్ అంటున్నారు.