Smartphone Sales | ఈ ఏడాది జులై-సెప్టెంబర్ మధ్య భారత్ స్మార్ట్ఫోన్ మార్కెట్ స్వల్పంగా వృద్ధిని నమోదు చేసింది. ఓమ్డియా నివేదిక ప్రకారం.. ఈ త్రైమాసికంలో స్మార్ట్ఫోన్స్ షిప్మెంట్స్ 3శాతం పెరిగి 48.4 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయి. వీవో ((iQOO మినహా) 9.7 మిలియన్ యూనిట్ల అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. 20శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఆ తర్వాత శామ్సంగ్ 6.8 మిలియన్ యూనిట్లతో (14శాతం), షియోమి, ఒప్పో ఒక్కొక్కటి 6.5 మిలియన్ యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఇక ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ 4.9 మిలియన్ యూనిట్లతో ఐదోస్థానంలో ఉంది. భారత్లో త్రైమాసిక అమ్మకాలను 10శాతం వాటా సొంతం చేసుకున్నది. చిన్న నగరాల్లో ఆపిల్ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు గణనీయమైన పెరిగాయని నివేదిక పేర్కొంది. పాత ఐఫోన్ మోడళ్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు వినియోగదారులు కొత్తవి ఫోన్లు కొనుగోలు చేసేలా ప్రోత్సహించాయని నివేదిక చెప్పింది.
పండుగ సీజన్కు ముందు కంపెనీలు మార్కెట్లోకి పెద్ద ఎత్తున కొత్త స్టాక్ను పంపాయి, క్యాష్ రివార్డ్, గోల్డ్ కాయిన్స్, బైక్లు, ట్రిప్ల పేరుతో రిటైలర్లు ఆఫర్స్ ప్రకటించడంతో అమ్మకాలు పెరిగాయి. జీరో డౌన్ పేమెంట్స్, ఈఎంఐలు, బండిల్డ్ ఆఫర్లు వంటి స్కీమ్స్తో కస్టమర్లను రిటైలర్లు ఆకర్షించారు. అయితే, ద్రవ్యోల్బణం, ఉద్యోగ అనిశ్చితి కారణంగా పట్టణ వినియోగదారులు ఇప్పటికీ తమ ఫోన్లను అప్గ్రేడ్ చేయడం వాయితా వేసుకున్నట్లుగా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది వచ్చే త్రైమాసికంలో ఇన్వెంటరీ పెరుగుదలకు దారితీసే అవకాశం ఉందని అంచనా వేశారు. గ్రామీణ డిమాండ్ ప్రస్తుతం స్థిరంగా ఉందని, పట్టణ ప్రాంతంలో మందగమనాన్ని భర్తీ చేయడం లేదని పేర్కొన్నారు. రికవరీ బలహీనంగా ఉండడం, ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉండటంతో ఈ ఏడాదిలో భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ స్వల్పంగా తగ్గుదలను నమోదు చేయొచ్చని ఓమ్డియా అంచనా వేసింది.