Hindenburg | న్యూఢిల్లీ, ఆగస్టు 24: అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదిక ఏ స్థాయిలో ప్రకంపనల్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ కార్పొరేట్ వర్గాల నుంచి రాజకీయ రంగందాకా ఈ అంశం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే భారతీయ బడా కంపెనీల్లో ఒక దానిపై ఇదే తరహా రిపోర్టు రాబోతున్నట్టు తెలుస్తున్నది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) దీన్ని తయారు చేస్తున్నట్టు సమాచారం. ఒకేసారి లేదా ఓ సిరీస్లా ఆర్టికల్స్ను విడుదల చేసే వీలున్నట్టు చెప్తున్నారు. ఇదే జరిగితే దేశీయ మార్కెట్లకు మళ్లీ గట్టి దెబ్బ తప్పదన్న అంచనాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఓసీసీఆర్పీని సంప్రదించినా స్పందన మాత్రం లేదు. దీంతో ఈ ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి. ఏ కార్పొరేట్ సంస్థ టార్గెట్ అవుతుందా? అన్న ఉత్కంఠ నెలకొన్నదిప్పుడు.
స్టాక్ లావాదేవీలే లక్ష్యం..
కార్పొరేట్ కంపెనీల స్టాక్స్లోకి వస్తున్న విదేశీ నిధులపైనే ఓసీసీఆర్పీ దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తున్నది. హిండెన్బర్గ్ సైతం ఇదే కోణంలో రిపోర్టును విడుదల చేసినది తెలిసిందే. ఈ క్రమంలో ఓసీసీఆర్పీ కూడా అదే బాటలో వెళ్లి అక్రమాల గుట్టురట్టు చేసేలా ఆరోపణల్ని ఎక్కు పెట్టవచ్చని అంటున్నారు. మొత్తంగా క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు.. రాబోయే రోజుల్లో తీవ్ర ఒడిదుడుకులకే లోనయ్యే వీలుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, వీటన్నింటితో స్టాక్ మార్కెట్లలో నమోదైన పెద్ద సంస్థల్నే ఓసీసీఆర్పీ లక్ష్యంగా చేసుకోనుందన్న సంకేతాలు మాత్రం స్పష్టమవుతున్నాయి.
ఏమిటీ ఓసీసీఆర్పీ
ఇది 2006లో ప్రారంభమైంది. జార్జ్ సోరోస్ వంటి సంస్థాగత డోనర్లు, ఓక్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, రాకెఫెల్లర్ బ్రదర్స్ ఫండ్ తరహా ఫండింగ్ సంస్థలు ఓసీసీఆర్పీ నిర్వహణలో కీలకం. ఇక 24 నాన్ప్రాఫిట్ ఇన్వెస్టిగేటివ్ సెంటర్ల పర్యవేక్షణలో సాగే ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ ప్లాట్ఫామ్ తమదని ఓసీసీఆర్పీ చెప్పుకుంటున్నది. సంస్థాగత నేరాలు, అవినీతి గుట్టు విప్పడంలో మార్కెట్లో ఓసీసీఆర్పీకి ప్రత్యేక స్థానమే ఉన్నది. ఆసియా దేశాలతోపాటు ఐరోపా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో ఓసీసీఆర్పీ ప్రభావం ఎక్కువే. జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల భాగస్వామ్యంతో ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో పెద్ద పేరునే సంపాదించింది. రిపోర్టింగ్లో భాగంగా భారీగా dxdవార్తా కథనాల ప్రచురణకు దిగుతున్నది.
రూ.12 లక్షల కోట్లు ఆవిరి
ఈ ఏడాది జనవరి 24న అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రిసెర్చ్.. అదానీ గ్రూప్ అవకతవకలకు పాల్పడుతున్నదని, స్టాక్ మార్కెట్లలో గ్రూప్ కంపెనీల షేర్ల విలువ పెరిగేలా అక్రమాలకు దిగుతున్నదని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ ఏకంగా రూ.12 లక్షల కోట్లు హరించుకుపోయింది. అదానీ సంస్థల్లో ఆయా కంపెనీల పెట్టుబడులు, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసీ కొన్న వాటాలపై పెద్ద ఎత్తున దుమారం రేగినది విదితమే. చివరకు అదానీ వ్యాపార విస్తరణకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు సహకరించిందని, దీనిపై లోతుగా దర్యాప్తు జరుగాలని పార్లమెంట్లో విపక్షాలన్నీ పట్టుబట్టినదీ తెలిసిందే. సుప్రీం కోర్టు జోక్యం వరకు వెళ్లింది కూడా. మొత్తానికి హిండెన్బర్గ్ రిపోర్టు నేపథ్యంలో ఓసీసీఆర్పీ వ్యవహారం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నది.