ముంబై, డిసెంబర్ 1: ప్రజల వద్ద ఉన్న భౌతిక బంగారాన్ని నగదీకరించేలా దేశంలో ఓ గోల్డ్ బ్యాంక్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ అన్నారు. బుధవారం డిజిటల్ లెండింగ్ ఫిన్టెక్ సంస్థ రూపీక్ ‘టెక్ డిస్ప్ష్రన్ మీట్స్ గోల్డ్ మానిటైజేషన్’ అంశంపై నిర్వహించిన ఓ వర్చువల్ కార్యక్రమంలో గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ బ్యాంక్ కోసం కొత్త లైసెన్సింగ్ పాలసీతోపాటు బంగారం ప్రామాణికతతో ప్రత్యేకంగా నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని, చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి (ఎస్ఎల్ఆర్)ని ప్రవేశపెట్టాల్సి ఉంటుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతికి పసిడి నగదీకరణ దోహదపడగలదని అభిప్రాయపడ్డ గాంధీ.. బంగారం అంటే భారతీయులకు సెంటిమెంట్ అని, దాన్ని అలాగే ఉంచుకోవడానికి ఇష్టపడుతారు తప్ప, నగదుగా మార్చుకోరని కూడా అన్నారు.
ఇండ్లలో, దేవాలయాలు మరికొన్ని మతపరమైన ట్రస్టులు, సంస్థల వద్ద దాదాపు 23,000-24,000 టన్నుల బంగారం ఉండొచ్చని గాంధీ ఈ సందర్భంగా అంచనా వేశారు. ఇంత బంగారం వృథాగానే ఉండిపోతున్నదన్న ఆయన దీన్ని నగదుగా మార్చితే అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వాలకు తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం ఉంటుందన్నారు. పలు కీలక రంగాల అభివృద్ధికి ఎన్నో పెట్టుబడులు అవసరమని, పసిడి నగదీకరణతో ఆ అవసరాలు తీరుతాయన్నారు. ముఖ్యంగా విదేశీ పెట్టుబడులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. అయితే ప్రజల మనస్తత్వం మారితేనే పసిడి నగదీకరణ విజయం సాధించగలదన్న ఆయన అదంత సులభం కాదని కూడా వ్యాఖ్యానించారు.
ప్రజలు, సంస్థలు తమ వద్ద ఉన్న బంగారు నగలు, నాణేలతోపాటు ఇతరత్రా రూపంలో ఉన్న పసిడిని ఈ గోల్డ్ బ్యాంక్లో డిపాజిట్ చేయవచ్చు. తద్వారా రుణాలు పొందవచ్చు. భౌతిక బంగారాన్ని నగదుగా మార్చడానికి ఈ బ్యాంక్ ఓ ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. నిజానికి నగల వంటి భౌతిక బంగారంపై ప్రజలు తమ ధనాన్ని పెట్టకుండా, గోల్డ్ డిపాజిట్లు, గోల్డ్ మెటల్ లోన్లు, గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ల్లో పెట్టేలా ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలను ఎప్పట్నుంచో చేస్తున్నది. అయితే నగల రూపంలో ఉన్న బంగారానికే ప్రజలు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇవేవి విజయవంతం కాలేకపోతున్నాయి.