ముంబై, మార్చి 1: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)లో దేశ టెక్నాలజీ రంగ వృద్ధిరేటు మందగించవచ్చని నాస్కామ్ అభిప్రాయపడింది. 8.4 శాతం వృద్ధితో 245 బిలియన్ డాలర్లకు పరిమితం కావచ్చని బుధవారం అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2021-22) ఈ దశాబ్దంలోనే అత్యుత్తమంగా 15.5 శాతం వృద్ధితో 226 బిలియన్ డాలర్లకు పరిశ్రమ చేరింది. కరోనా నేపథ్యంలో టెక్నాలజీ అవసరం పెరగడంతో ఐటీ సేవలకు వచ్చిన డిమాండే ఇందుకు కారణం. కాగా, ఓవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భౌగోళిక రాజకీయ సవాళ్లకు దారితీస్తున్నదని, మరోవైపు విజృంభిస్తున్న ద్రవ్యోల్బణం.. ప్రపంచవ్యాప్తంగా వడ్డీరేట్ల పెరుగుదలకు కారణమవుతున్నదని, దీంతో టెక్నాలజీ రంగానికి ఒడిదుడుకులు తప్పవనే అనిపిస్తున్నట్టు నాస్కామ్ వ్యాఖ్యానించింది.
ఐటీ రంగంలోని చీఫ్ ఎగ్జిక్యూటివ్ల్లో భవిష్యత్తుపై స్పష్టమైన భరోసా కనిపించడం లేదని నాస్కామ్ సర్వే చెప్తున్నది. ఈ క్రమంలోనే వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను లక్ష్యాన్నీ ఇండస్ట్రీ నిర్దేశించుకోలేకపోతున్నది. భౌగోళిక రాజకీయ ఆందోళనలు ఐటీ కాంట్రాక్టులకు సంబంధించి సంస్థాగత నిర్ణయాల్లో జాప్యానికి దారితీస్తున్నాయని నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్జాని ఘోష్ అన్నారు. అలాగే కొన్ని మార్కెట్లలో డిమాండ్ పడిపోయిందనీ చెప్పారు.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్లో ఆశించిన నైపుణ్యం, ప్రతిభ కనిపించడం లేదన్న ఘోష్.. ఇప్పుడున్న విద్యా వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందన్నారు. బలమైన వ్యవస్థాగత నిర్మాణం, ప్రొఫెషనల్ స్కిల్స్పై విద్యా సంస్థలు దృష్టి పెట్టాలని సూచించారు. ఐటీ కంపెనీలు సైతం కొత్తవారిని ఉద్యోగాల్లోకి తీసుకునే ముందే వారికి మరింత శిక్షణ ఇవ్వడంపై శ్రద్ధ కనబర్చాలని అన్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం 2.9 లక్షల మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఐటీ కంపెనీలు చూస్తున్నాయి. ఇందులో 1.4 లక్షల మంది మహిళలు కూడా ఉంటారు. ఇదే జరిగితే ఐటీ ఉద్యోగులు 54 లక్షలకు చేరుతారు. వీరిలో 20 లక్షల మహిళలే. అయినప్పటికీ గత ఆర్థిక సంవత్సరం నియామకాలతో చూస్తే తక్కువే. నాడు 4.5 లక్షల మంది కొత్తగా వచ్చారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న కృత్రిమ మేధస్సు వేదిక చాట్జీపీటీపై ఘోష్ స్పందించారు. ఉద్యోగులపై దీని ప్రభావం పరిమితంగానే ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు ఉద్యోగులు చేస్తున్న పనిని చాట్జీపీటీ తక్కువ ఖర్చుతోనే సమర్థవంతంగా చేస్తున్నదన్న ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటిదేమీ ఉండబోదన్నారు. కాగా, కరెన్సీ ప్రాతిపదికన భారతీయ ఐటీ ఎగుమతులు 9.4 శాతం వృద్ధితో 194 బిలియన్ డాలర్లను చేరవచ్చని అంచనా. కరెన్సీ మార్కెట్ ప్రభావం లేకపోతే వృద్ధిరేటు 11.4 శాతంగా ఉండొచ్చని చెప్తున్నారు.