న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఓవైపు సాంకేతిక సమస్యలు.. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు.. ఈ నడుమ జీతాలు ఆలస్యమవుతున్నాయని స్వరం పెంచుతున్న ఉద్యోగులు. ఇదీ.. దేశీయ ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ స్పైస్జెట్లోని పరిస్థితిప్పుడు. వరుసగా రెండో నెలా తమ వేతనాలు ఇంకా రాలేదని బుధవారం ఉద్యోగులు తెలిపారు. గ్రేడింగ్ విధానంలో జీతాలు వేస్తుండటమే కారణమంటున్నారు. ఈ క్రమంలోనే సంస్థాగత సిబ్బందితోపాటు విమానాల్లో పనిచేసే ఉద్యోగులకు జూలై నెల చెల్లింపులు ఇప్పటికీ జరగలేదని పేర్కొంటున్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను చాలామందికి ఫామ్-16 ఇంకా అందలేదని ఉద్యోగులు చెప్తున్నారు. ఉద్యోగుల గ్రేడ్ ఆధారంగానే జీతాల చెల్లింపుల్ని చేస్తున్నామని స్పైస్జెట్ కూడా అంటున్నది. అయితే పెరిగిన విమానయాన ఇంధన ధరలు, సహజంగానే జూలై-సెప్టెంబర్లో ఉండే ప్రతికూల వ్యాపార పరిస్థితులు గత కొద్దినెలలుగా విపత్కర పరిణామాల్ని సృష్టిస్తున్నాయని సంస్థ యాజమాన్యం చెప్తున్నది.
క్షీణిస్తున్న షేర్ విలువ
స్పైస్జెట్ షేర్ విలువ గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ట్రేడింగ్లో 3 శాతానికిపైగా దిగజారింది. నిజానికి ఆరంభంలో దాదాపు 15 శాతం నష్టపోయింది. ఏప్రిల్-జూన్ ఆర్థిక ఫలితాలే ఇందుకు కారణం. అయితే మళ్లీ షేర్ విలువ కోలుకోవడంతో మదుపరులకు భారీ నష్టాలు తప్పినైట్టెంది. అయినప్పటికీ చివరకు 3.13 శాతం పతనమై రూ.44.95 వద్ద ముగిసింది. ఇదిలావుంటే 89 మంది ప్రయాణీకులతో గురువారం ఢిల్లీ నుంచి నాసిక్కు బయలుదేరిన స్పైస్జెట్ విమానం మధ్యలోనే వెనక్కి తిరిగొచ్చేసింది. ఆటోపైలట్ వ్యవస్థలో తలెత్తిన సమస్యే కారణమని స్పైస్జెట్ తెలిపింది. మరోవైపు దీనిపై పౌరవిమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) దర్యాప్తునకు ఆదేశించింది. అద్దెదారులకు బకాయిల్ని చెల్లించని కారణంగా స్పైస్జెట్కు చెందిన రెండు బోయింగ్ 737 విమానాల నమోదును బుధవారం డీజీసీఏ రద్దు చేసింది. దీంతో వీటిని నడపడానికి వీల్లేకుండాపోయింది. కేవలం 50 శాతం విమానాల్నే నడపాలని జూలైలో స్పైస్జెట్ను డీజీసీఏ ఆదేశించిన విషయం తెలిసిందే. తరచూ వస్తున్న సాంకేతిక సమస్యలే ఇందుకు కారణం.
రూ.789 కోట్ల నష్టం
ఈ ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో స్పైస్జెట్ రూ.789 కోట్ల నికర నష్టాలను చవిచూసింది. అధిక ఇంధన ధరలు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ పతనం తీవ్రంగా ప్రభావితం చేసినట్టు పేర్కొన్నది. నిరుడు ఏప్రిల్-జూన్లోనూ రూ.729 కోట్ల నికర నష్టాలను స్పైస్జెట్ అందుకోవాల్సి వచ్చింది. నిజానికి గతంతో పోల్చితే ఆదాయం రూ.1,266 కోట్ల నుంచి రూ.2,478 కోట్లకు పెరిగింది. అయినా నష్టాలే మిగిలాయి. ఇదిలావుంటే సంస్థ సీఎఫ్వో సంజీవ్ తనేజా రాజీనామా బుధవారం నుంచే అమల్లోకి వచ్చినట్టు స్పైస్జెట్ ప్రకటించింది.