Jet Airways-Naresh Goyal | తన భార్య అనితా గోయల్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ జీవిత చరమాంకంలో ఉందని, ఈ దశలో తాను ఆమె పక్కన ఉండేందుకు బెయిల్ మంజూరు చేయాలని బాంబే హైకోర్టులో జెట్ ఎయిర్వేస్ ఫౌండర్ నరేశ్ గోయల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై శుక్రవారం సింగిల్ బెంచ్ ధర్మాసనం విచారణ జరిపింది. నరేశ్ గోయల్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. తన క్లయింట్ వేదనను ధర్మాసనానికి విన్నవించారు.
‘నరేశ్ గోయల్, ఆయన భార్య అనిత.. ఇద్దరూ క్యాన్సర్తో బాధ పడుతున్నారు. నరేశ్ గోయల్ భార్య పరిస్థితి క్లిష్టంగా ఉంది. ఇంకొన్ని నెలలే బతుకుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు. శరీరం కంటే మనస్సు చాలా బలహీనమైంది. దీనికి తోడు నరేశ్ గోయల్ కూడా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అనితకు వైద్య చికిత్స అందుతున్నా, ఆమెకు సొంత వారి ప్రేమ అవసరం. ఆ కొద్ది నెలలైనా తన భార్యతో ఉండేలా నరేశ్ గోయల్కు స్వేచ్ఛ ఇవ్వండి’ అని హరీశ్ సాల్వే కోరారు. ఆయనపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవే అయినా ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో మానవతా దృక్పథంతో బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
తన భార్య అనారోగ్యం పేరుతో బెయిల్ మంజూరు చేయాలన్న నరేశ్ గోయల్ పిటిషన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యతిరేకించింది. ఆయన్ను డిశ్చార్జీ చేయడానికి వైద్యులు అంగీకరించలేదని తెలిపింది. అవసరమైతే మరో నెల రోజులు ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందొచ్చునని తెలిపింది. ఇరువైపులా వాదనలు విన్న సింగిల్ బెంచ్.. ఈ నెల ఆరో తేదీకి తీర్పు వాయిదా వేసింది. అప్పటి వరకూ నరేశ్ గోయల్ను డిశ్చార్జీ చేయొద్దని ఆదేశించింది.
ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్’కు కెనరాబ్యాంకు ఇచ్చిన రూ.848.86 కోట్ల రుణంలో జెట్ ఎయిర్వేస్ రూ.538.62 కోట్ల రుణం చెల్లించలేదు. దీంతో కెనరాబ్యాంకు ఫిర్యాదు మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం మోసగించిందని నిర్ధారించింది. ఇదే కేసులో హవాలా లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన ఈడీ కూడా దర్యాప్తు చేపట్టి గత సెప్టెంబర్ ఒకటో తేదీన నరేశ్ గోయల్ను అరెస్ట్ చేసింది.