NR Narayana Murthy | న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: ఎన్ఆర్ నారాయణ మూర్తి.. భారతీయ వ్యాపార రంగంలో, ప్రపంచ ఐటీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పుడీయన మనుమడు కూడా అంతే స్థాయిలో పాపులరైపోయాడు. అవును.. ఏకాగ్రహ్ రోహన్ మూర్తి వయసు 5 నెలలు. కానీ సంపద రూ.244 కోట్లపైనే మరి. నారాయణ మూర్తి, సుధామూర్తిల కుమారుడు రోహన్ మూర్తి, అపర్ణా క్రిష్ణన్ దంపతుల ఏకైక కొడుకే ఈ ఏకాగ్రహ్ మూర్తి. ఏకాగ్రహ్కు ఇటీవలే తన తాత, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి.. రూ.240 కోట్ల విలువైన 15 లక్షల కంపెనీ షేర్లను బహుమతిగా ఇచ్చారు.
దీంతో దేశీయ రెండో అతిపెద్ద ఐటీ రంగ సంస్థ అయిన ఇన్ఫోసిస్ వాటాదారుల్లో షేర్లపరంగా అతిపిన్న వయసు కలిగిన మిలియనీర్, విలువపరంగా బాల బిలియనీర్గా ఏకాగ్రహ్ చరిత్ర సృష్టించారు. అయితే తాజాగా ఈ బెంగళూరు ఆధారిత ఐటీ రంగ సంస్థ బంపర్ డివిడెండ్ను ప్రకటించింది. ఇన్ఫోసిస్ ద్వారా వచ్చిన ఈ తుది, ప్రత్యేక డివిడెండ్లతో ఏకాగ్రహ్ మూర్తికి తన వాటా ప్రకారం రూ.4.2 కోట్లు వస్తున్నాయి. దీంతో ఏకాగ్రహ్ సంపద విలువ రూ.244 కోట్లను దాటేసింది. గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఒక్కో షేర్కు ఫైనల్ డివిడెండ్గా రూ.20, ప్రత్యేక డివిడెండ్గా అదనంగా మరో రూ.8, మొత్తం రూ.28ని ఇన్ఫోసిస్ బోర్డు గురువారం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ డివిడెండ్ల చెల్లింపులకు రికార్డ్ తేదీ మే 31. జూలై 1న షేర్హోల్డర్లకు ఇన్ఫోసిస్ చెల్లిస్తుంది.