NR Narayana Murthy | దేశంలోని పని సంస్కృతిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో ఇతర దేశాలతో భారత్ పోటీ పడాలంటే యువతరం వారానికి 70 గంటలు పని చేయడానికి సిద్ధ పడాలని పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ మోహన్ దాస్ పాయి ఆధ్వర్యంలోని 3 వన్ 4 క్యాపిటల్ పాడ్ కాస్ట్ ‘ది రికార్డ్’ తొలి ఎపిసోడ్లో ఎన్ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు.
జపాన్, జర్మనీ తదితర దేశాల్లో అదనపు పని గంటల విధానం అమలు చేస్తున్నారని నారాయణ మూర్తి గుర్తు చేశారు. జాతి నిర్మాణం, టెక్నాలజీ, తన కంపెనీ ఇన్ఫోసిస్ తదితరాల గురించి ఆయన కుండబద్ధలు కొట్టారు. వచ్చే 10-15 ఏండ్లకు తన విజన్ ఏమిటో వెల్లడించారు. భారత్ లో ఉత్పాదకత పెంచాలని, ప్రభుత్వం వైపు నుంచి జాప్యం నివారించాలన్నారు.
‘ప్రపంచంలోకెల్లా భారత్లోనే ఉత్పాదకత అతి తక్కువ. ఉత్పత్తిలో మన పని మెరుగు పర్చుకోలేకపోయినా, ప్రభుత్వంలో కొంత స్థాయి వరకూ అవినీతి తగ్గించకపోయినా.. అద్భుతమైన ప్రగతి సాధించిన దేశాలతో మనం పోటీ పడలేం’ అని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. ‘నా యువతరానికి నేను చేసే రిక్వెస్ట్ ఒకటే.. ‘ఇది నా దేశం. నా దేశం కోసం నేను వారానికి 70 గంటలు పని చేస్తాను’ అని తప్పనిసరిగా ప్రతిజ్ఞ చేయాలి` అని నారాయణ మూర్తి చెప్పారు.