Musk Auction | ట్విట్టర్ను టేకోవర్ చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ అక్కడ తన మార్క్ చూపేందుకు తాపత్రయపడుతున్నాడు. ఇప్పటికే బ్లూ చెక్ సర్వీసులను ప్రారంభించిన ఎలాన్ మస్క్.. కార్యాలయంలోని బర్డ్ ఫీడర్ పేరును మస్క్ మెనూగా మార్చారు. అలాగే అక్కడ దొరికే ప్రతి చిరుతిండి ధరను 8 డాలర్లుగా పెట్టారు. ఇప్పుడు శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ హెడ్క్వార్టర్స్లో ఉన్న 265 వస్తువులను ఆన్లైన్లో వేలంకు ఉంచనున్నాడు. ఈ వేలంను వచ్చే నెల 17 నుంచి ప్రారంభం కానున్నది.
ఆన్లైన్ వేలంలో పలు వంటగది వస్తువులు, ఎలక్ట్రానిక్స్, కాఫీ మెషీన్లు, ఫర్నిచర్ వంటి వస్తువులను ఉంచారు. ఆన్లైన్ బిడ్డింగ్ జనవరి 17 నుంచి జనవరి 18 వరకు అమలు చేస్తారు. చాలా వస్తువుల ప్రారంభ ధర 25 లేదా 50 డాలర్లుగా ఉంచారు. ఈ విషయాలను ఆన్లైన్ సైట్ BidSpotter లో కూడా చేర్చారు. వేలం ముగిసిన 48 గంటల్లోపు బిడ్డింగ్ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. వేలం వేయనున్న వస్తువుల్లో రెండు ఎక్సర్సైజ్ బైక్లు, ఎస్ప్రెస్సో మెషీన్లు, గూగుల్ 55-ఇంచెస్ డిజిటల్ వైట్ బోర్డ్ డిస్ప్లే, డజన్ల కొద్దీ కుర్చీలు, కాఫీ వెండింగ్ మెషీన్లు ఉన్నాయి. ఈ వేలంతో ట్విట్టర్ ఆర్థిక స్థితికి ఎలాంటి సంబంధం లేదని వేలం పనులు చూస్తున్న హెరిటేజ్ గ్లోబల్ పార్ట్నర్స్కు చెందిన నిక్ డోవ్ తెలిపారు.
ట్విట్టర్ను టేకోవర్ చేసిన తర్వాత ఎలాన్ మస్క్కు రోజూ 32 కోట్ల నష్టం వస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ని మస్క్ కొనుగోలు చేశాడు. ట్విట్టర్ ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నట్లు తెలుస్తున్నది. సబ్స్క్రిప్షన్ మోడల్ ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్లాన్ చేశారు. బ్లూ చెక్ సర్వీసులను ఇవాల్టి నుంచి మొదలుపెట్టారు. నష్టాలను భర్తీ చేసుకునేందుకు ప్రధాన కార్యాలయం ఆస్తుల వేలాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.