Billionaire Capital- Mumbai | దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై.. ఆసియా ఖండంలోనే కుబేరులకు కేంద్రంగా మారింది. చైనా రాజధాని బీజింగ్ ను దాటేసి మూడో స్థానానికి దూసుకెళ్లిందని ‘హురున్ రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్’ తెలిపింది. ముంబైలో 92 మంది కుబేరులు 603 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నివసిస్తూ ఉంటే, బీజింగ్లో 91 మంది కుబేరులు 16 వేల చదరపు కి.మీ విస్తీర్ణంలో నివసిస్తున్నారు. గత ఏడాది కాలంలో ముంబైలో కొత్తగా 26 మంది బిలియనీర్లుగా రూపాంతరం చెందారు. బీజింగ్ వాసుల్లో 18 మంది కుబేరులు ఈ జాబితా నుంచి తగ్గిపోయారు. అయితే చైనాలో 814 మంది బిలియనీర్లు ఉంటే, భారత్ లోనే 271 మంది బిలియనీర్లు మాత్రమే ఉన్నారు.
న్యూయార్క్, లండన్ తర్వాత కుబేరుల పట్టణంగా ముంబై నిలిచింది. న్యూయార్క్లో 119 మంది కుబేరులుంటే, లండన్ నగర పరిధిలో 97 మంది ఉన్నారు. బిలియనీర్ల వ్యక్తిగత ఆస్తి 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.8,333 కోట్లు). ముంబైలోని 92 మంది బిలియనీర్ల సంపద గత ఏడాది కాలంలో 47 శాతం పెరిగి 445 బిలియన్ డాలర్ల (రూ.37.09 లక్షల కోట్లు)కు పెరిగింది. చైనా రాజధాని బీజింగ్ కుబేరుల సంపద 28 శాతం పురోగతితో 265 బిలియన్ డాలర్ల (రూ.22.08 లక్షల కోట్లు)కు చేరింది.
ప్రపంచంలోనే టాప్-20 బిలియనీర్లలో భారతీయులు ఇద్దరే. ప్రస్తుతం భారత్ లో 271 మంది కుబేరులు ఉన్నారు. టాప్-11 స్థానంలో నిలిచిన రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద రూ.9.43 లక్షల కోట్లు, 18వ స్థానంలో ఉన్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ వ్యక్తిగత సంపద రూ.6.73 లక్షల కోట్లు.