Crypto Fraud | రోజురోజుకు పెరిగిపోతున్న డిజిటల్ పేమెంట్స్.. తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలిచ్చే క్రిప్టో కరెన్సీలు.. మోసగాళ్లకు అంది వచ్చిన ఆయుధంగా మారాయి. ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆకర్షించి.. వారికి రుణాలిచ్చినట్లే ఇచ్చి.. వారి ఖాతాల నుంచి నగదు స్వాహా చేసేస్తున్నారు. రుణ గ్రహీతలు గడువులోగా రుణాలు చెల్లించినా.. మరింత బకాయిలు చెల్లించాలని బెదిరింపులు.. వారి కుటుంబ సభ్యులు.. ప్రత్యేకించి మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసి, బంధు మిత్రులకు షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్న ముఠా గుట్టు ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. చైనా లోన్ యాప్ ద్వారా మోసగాళ్లు చేస్తున్న దారుణాలను బయట పెట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ మోసానికి పాల్పడిన ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు.
ఓ బాధిత మహిళ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల ఐఎఫ్ఎస్వో యూనిట్ దర్యాప్తు చేపట్టింది. దన క్రెడిట్-క్యాష్ అడ్వాన్స్ ( Danakredit ) అనే లోన్ యాప్ నుంచి బాధితురాలు రుణం తీసుకున్నారు. సకాలంలో రుణం చెల్లించేశారు. కానీ రుణం చెల్లించిన తర్వాత ఆమెకు క్యాష్ అడ్వాన్స్ ఉద్యోగులు బెదిరింపు ఫోన్ కాల్స్, మెసేజ్లు పంపారని డీసీపీ (ఐఎఫ్ఎస్వో) కేపీఎస్ మల్హోత్రా ఆదివారం చెప్పారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్ ప్రొఫైల్ పిక్చర్తో బాధితురాలిని వేధిస్తున్నారని తెలిపారు. వీరిపై ఐసీపీలోని 354ఏ, 509, 384, 385, 419, 420, 120 బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని వివరించారు.
మోటార్ సైకిల్ రిపేర్ షాప్ అడ్రస్తో బాలాజీ టెక్నాలజీ అనే పేరుతో బ్యాంకులో కరంట్ ఖాతా తెరిచారు. ఈ ఖాతా నుంచే నగదు లావాదేవీలు జరుపుతున్నారు. ఢిల్లీలోని రాజీవ్నగర్ వాసి రోహిత్ కుమార్ ఈ ఖాతా నిర్వాహకుడని పోలీసులు తెలిపారు. వీరు కేవలం 15 రోజుల్లో వివిధ ఖాతాల్లో రూ.8.45 కోట్లు జమ చేసి, అంతే మొత్తాన్ని ఇతర ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేశారు. దీనిపై ఢిల్లీ, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో గత నెల 13,14 తేదీల్లో దాడులు జరిపి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. భారత్లో మోసాలకు కుట్రదారు కృష్ణ అలియాస్ రవిశంకర్ అని పోలీసులు చెప్పారు. వివిధ ఖాతాల నుంచి లాగేసిన నగదు మొత్తాన్ని క్రిప్టో కరెన్సీల ద్వారా చైనీయుల క్రిప్టో ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు తేలిందని డీసీపీ మల్హోత్రా తెలిపారు.
ఈ ముఠా నగదు అవసరమైన వారిని గుర్తిస్తుంది. దన్ క్రెడిట్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నప్పుడే కాంటాక్ట్ లిస్ట్, ఫొటో గ్యాలరీ, సదరు వ్యక్తి వ్యక్తిగత డేటా తీసుకునేందుకు పర్మిషన్ అడుగుతుంది. రుణ గ్రహీత పర్మిషన్ ఇవ్వగానే.. డేటా మొత్తం చైనా సర్వర్లకు బదిలీ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రుణ గ్రహీత ఖాతాలో డబ్బు జమ చేస్తారు. ఆ తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. వేర్వేరు నంబర్ల ద్వారా వారి బంధు మిత్రులకు ఫోన్ చేసి.. రుణం చెల్లించేలా ఒత్తిడి తెస్తారు.
ఈ మోసగాళ్లకు చెందిన మరో ముఠా ఆర్థిక లావాదేవీలు జరుపుతుంది. రుణ గ్రహీత.. ఆయన కుటుంబ సభ్యుల ఖాతాల నుంచి లాగేసుకున్న డబ్బును క్రిప్టో కరెన్సీల్లోకి మార్చేస్తారు. చైనా, హాంకాంగ్, దుబాయ్, నేపాల్లలో ఉన్న తమ యజమానులకు క్రిప్టో కరెన్సీల రూపంలో పంపించేస్తారు. ఈ పని చేయడంలో ప్రదర్శించిన ప్రతిభకు అనుగుణంగా మోసగాళ్లకు వాటాలు వస్తాయి. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు సాగుతున్నదని డీసీపీ మల్హోత్రా చెప్పారు. మరికొంత మంది బాధితులు బయటపడే అవకాశం ఉందన్నారు. ఈ ముఠాలోని ఇతర సభ్యులను గుర్తించాల్సి ఉందన్నారు.