ముంబై: రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) ఆదివారం మరో మెగా సంస్థను సొంతం చేసుకుంది. నార్వేలో ప్రధాన కార్యాలయం ఉన్న ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్ సంస్థను దక్కించుకుంది. దీనికోసం 77.1 కోట్ల డాలర్లు (సుమారు రూ.5800 కోట్లు) వెచ్చించింది. ప్రపంచంలోని లీడింగ్ సోలార్ ఎనర్జీ కంపెనీల్లో ఇది కూడా ఒకటి. మంచి సామర్థ్యం, మన్నిక కలిగిన సోలార్ సెల్స్, ప్యానెల్స్ను తయారు చేస్తుందని ఈ సంస్థకు పేరుంది. చైనాకు చెందిన బ్లూస్టార్ నుంచి రిలయెన్స్ ఈ సంస్థను దక్కించుకోవడం గమనార్హం.
రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన రిలయెన్స్ న్యూ ఎనర్జీ సోలార్ లిమిటెడ్ సంస్థ ఆర్ఈసీ సోలార్ హోడ్లింగ్స్ను సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సంస్థను దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని ఆర్ఐఎల్ సీఎండీ ముకేశ్ అంబానీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ఈసీ సంస్థలో పని చేస్తున్న 1300 మంది ఉద్యోగులు ఇప్పుడు రిలయెన్స్ ఇండస్ట్రీస్ కుటుంబంలో సభ్యులని చెప్పారు. వచ్చే మూడేళ్లలో గుజరాత్లోని జామ్నగర్లో నాలుగు పునుత్పాదక ఇంధన గిగాఫ్యాక్టరీలను రూ.75వేల కోట్లతో నెలకొల్పనున్నట్లు ఈ ఏడాది ఏజీఎంలో రిలయెన్స్ ప్రకటించింది.