Mukesh Ambani | బిలియనీర్ ముకేశ్ అంబానీ.. ఇంగ్లిష్ ఫుట్బాల్ క్లబ్ `లివర్పూల్ ఎఫ్సీ`ని కొనుగోలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం లివర్పూల్ ఎఫ్సీ ఫ్రాంచైనీని ఫెన్వే స్పోర్ట్స్ గ్రూప్ (ఎఫ్ఎస్జీ) నిర్వహిస్తున్నది. 2010 అక్టోబర్లో లివర్పూల్ ఎఫ్సీని ఫెన్వే స్పోర్ట్స్ కొనుగోలు చేసింది. కాగా, లివర్పూల్ ఎఫ్సీ విక్రయ ప్రక్రియలో ఇంటర్నేషనల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థలు గోల్డ్మాన్ సాచెస్, మోర్గాన్ స్టాన్లీలను ఫెన్వే స్పోర్ట్స్ గ్రూప్ ఎఫ్సీ నియమించుకున్నది. `ది మిర్రర్` కథనం ప్రకారం ఫెన్వే స్పోర్ట్స్ గ్రూప్ (ఎఫ్ఎస్జీ).. 400 కోట్ల బ్రిటిష్ పౌండ్లకు విక్రయించనున్నదని సమాచారం.
ఇండియాలో స్పోర్ట్స్ ప్రోత్సాహంలో ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గణనీయంగా ఆసక్తి కనబపరుస్తున్నది. టీ-20 టోర్నీ ఐపీఎల్ ముంబై ఫ్రాంచైసీ యజమానిగా ఉన్నది. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్తో కలిసి ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) నిర్వహిస్తున్నది.
కొన్నేండ్లుగా భారత్లో రిలయన్స్ ఇండస్ట్రీస్తోపాటు జేఎస్డబ్ల్యూ, హీరో మోటో కార్ప్, అదానీ గ్రూప్ సంస్థలు ఫుట్బాల్ ప్రోత్సాహానికి నిధులు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే దేశంలో ఫుట్బాల్ను ప్రోత్సహించడానికి టాటా గ్రూప్ నిధులు వెచ్చిస్తున్నది. జార్ఖండ్పూర్లోని జంషెడ్పూర్లో టాటా సన్స్ ఏకంగా టాటా ఫుట్బాల్ అకాడమీ గత 35 ఏండ్లుగా నిర్వహిస్తున్నది.
ఫుట్బాల్, క్రికెట్తోపాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ (రిలయన్స్) భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఎఫ్ఐ)తో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకున్నది. కామన్వెల్త్, ఏషియన్, ఒలింపిక్ గేమ్స్లో అథ్లెట్లకు మద్దతు పలికేందుకు ఐవోఏ, ఏఏఎఫ్ఐతో టైఅప్ అయింది.
2024 పారిస్ ఒలింపిక్స్ కోసం భారత్ ఒలింపిక్ అసోసియేషన్ కోసం తొలిసారి ఇండియా హౌస్ నిర్మిస్తున్నది రిలయన్స్. క్రికెటేతర ఆటలు.. కబడ్డీ, ఫుట్బాల్ వంటి ఆటలను ప్రోత్సహించడానికి స్పాన్షర్షిప్ 12 శాతం పెరిగి గతేడాది రూ.9,500 కోట్లకు చేరింది. దేశంలో స్పోర్ట్స్ యాడ్స్లో 88 శాతం క్రికెట్ ప్రోత్సాహానికి వినియోగిస్తున్నారు. కరోనాకు ముందు ఇతర క్రీడలకు సుమారు 8 శాతం నిధులు ఖర్చు చేసేవారు. కరోనా తర్వాత అథ్లెటిక్స్, కబడ్డీ వంటి ఆటలకు స్పాన్షర్షిప్లు మిణుకుమిణుకుమని అంటున్నాయి.