Mukesh Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ ముకేశ్ అంబానీ ఖాతాలో మరో విలాసవంతమైన విల్లా వచ్చి చేరనున్నది. దుబాయ్ లోని పాలెం జుమెరాహ్ దీవిలో రూ.1,350 కోట్ల (163 మిలియన్ల డాలర్లు) విలువ చేసే విల్లాను ముకేశ్ అంబానీ కొనుగోలు చేసినట్లు సమాచారం. కువైట్ టైకూన్ మహమ్మద్ అల్ షాయా నుంచి గత వారం ఈ విల్లాను కొనుగోలు చేశారని వార్తలొచ్చాయి.
స్టార్ బక్స్, హెచ్ అండ్ ఎం, విక్టోరియాస్ సీక్రేట్ తదితర సంస్థలకు దుబాయ్లో ఫ్రాంచైసీగా మహమ్మద్ అల్ షాయా వ్యాపార సంస్థలు పని చేస్తున్నాయని బ్లూంబర్గ్ వార్తాకథనం. దుబాయ్ లోనే ఈ ఏడాది ముకేశ్ అంబానీ తన రెండో కొడుకు అనంత్ అంబానీ కోసం 80 మిలియన్ డాలర్లతో కొనుగో్లు చేసిన ఇంటికి కొద్ది దూరంలోనే ఈ విల్లా ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు చెప్పారు.
కొత్తగా కొనుగోలు చేసిన దుబాయ్ విల్లాలో ఒకటి కాదు రెండు కాదు పది బెడ్ రూమ్లు, ఒక ప్రైవేట్ స్పా, ఇండోర్ అండ్ ఔట్ డోర్ పూల్స్ కూడా ఉన్నాయి. ఒక జిమ్నాజియం, 18 బాత్ రూమ్లు, 15 కార్ల పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. దుబాయ్ లోని పాలెం జుమెరాహ్ దీవిలో ముకేశ్ అంబానీ ఒక విల్లాను కొనుగోలు చేసిన సంగతిని దుబాయ్ లాండ్ డిపార్ట్ మెంట్ కన్ఫర్మ్ చేసింది. 163 మిలియన్ డాలర్లకు మాన్షన్ కొనుగోలు చేసిందని పేర్కొంది. కానీ కొనుగోలు దారు ఎవరు అన్న సంగతి బయట పెట్టలేదు.
గతేడాది రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ బ్రిటన్లో 79 మిలియన్ డాలర్లతో ఐకానిక్ యూకే కంట్రీ క్లబ్ స్టోక్ పార్క్ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కొవిడ్-19 మహమ్మారి ప్రభావంతో దెబ్బతిన్న దుబాయ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ పుంజుకుంటున్నది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జనాభాలో 80 శాతం మంది విదేశీయులే. దేశ ఆర్థిక వ్యవస్థలోనూ వారే కీలకంగా ఉన్నారు. దుబాయ్లో రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనుగోలు చేస్తున్న వారిలో ఇండియన్స్ టాప్లో ఉంటారు.