MRF Share | వివిధ వాహనాలు నడవడానికి ఉపయోగించే టైర్ల తయారీ సంస్థ మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్ఎఫ్) మంగళవారం దలాల్ స్ట్రీట్లో సరికొత్త రికార్డు నమోదు చేసింది. మంగళవారం స్టాక్ మార్కెట్లలో అంతర్గత ట్రేడింగ్లో ఎంఆర్ఎఫ్ స్టాక్ విలువ అక్షరాల రూ.లక్ష దాటింది. ఉదయం ట్రేడింగ్ సమయంలో 10.45 గంటలకు ఎంఆర్ఎఫ్ షేర్ విలువ రూ.1,00,000.95 పలికింది. గత నెలలో ఎంఆర్ఎఫ్ షేర్లు స్వల్పంగా పతనం అయ్యాయి. కానీ, తిరిగి కోలుకుని రికార్డు నమోదు చేసిందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఎంఆర్ఎఫ్ షేర్లు గత ఏడాది కాలంలో 45 శాతానికిపైగా పుంజుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి సుమారు 14 శాతం లబ్ధి పొందింది. గత మూడేండ్లలో వాటాదారులకు 82 శాతం రిటర్న్స్ అందజేసింది.2022-23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ నికర లాభాలు 86 శాతం గ్రోత్ సాధించి రూ.313.5 కోట్లు సాధించింది. 2021-22 చివరి త్రైమాసికంలో కేవలం రూ.168.5 కోట్ల నికర లాభం మాత్రమే గడించింది.