Morgan Stanley on India GDP | వచ్చే రెండేండ్లు భారత్ వృద్ధిరేటు అంచనాలను మోర్గాన్ స్టాన్లీ తగ్గించి వేసింది. రోజురోజుకు పెరిగిపోతున్న ముడి చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, దేశీయంగా సరుకులకు డిమాండ్ బలహీనంగా ఉండటానికి కారణాలని పేర్కొంది. 2022-23లో జీడీపీ 7.6 శాతం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.7 శాతానికి భారత్ వృద్ధిరేటు పరిమితం అవుతుందని వెల్లడించింది. ఇంతకుముందు అంచనాల కంటే 30 బేసిక్ పాయింట్లు తక్కువ.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో పెరిగిన ముడి చమురు ధరల ప్రభావం భారత్లో రిటైల్ ద్రవ్యోల్బణం పైపైకి దూసుకెళ్లిందని మోర్టాన్ స్టాన్లీ భారత్ చీఫ్ ఎకనమిస్ట్ ఉపాసన చచ్రా చెప్పారు. ఇది బిజినెస్పై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ముడి సరుకుల ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోవడంతో నిత్యావసర వస్తువుల ధరలతోపాటు ద్రవ్యోల్బణం, కరంట్ ఖాతా లోటు (సీఏడీ) పెరుగుదలకు దారి తీస్తుందన్నారు.
నిత్యావసర వస్తువుల ధరలతో పైపైకి దూసుకెళ్తున్న ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేయడానికి ఈ నెల ప్రారంభంలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు పెంచేసింది. అయినా.. మున్ముందు ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 139 డాలర్లను స్థాయిని తాకింది. రష్యాను కట్టడి చేయడానికి పశ్చిమ దేశాలు ఆంక్షలు విధించాయి. కానీ డిస్కౌంట్ రేట్లపై రష్యా నుంచి భారత్ ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నది.