న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: కార్పొరేట్ మోసాల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ గ్రూప్ కంపెనీలకు అంతర్జాతీయ ఇండెక్స్ల ప్రొవైడర్ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (ఎంఎస్సీఐ) షాకిచ్చింది. తమ ఇండెక్స్ల్లోని నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల ఫ్రీ ఫ్లోట్స్ను (అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ట్రేడ్ చేసేందుకు అందుబాటులో ఉన్న షేర్ల పరిమాణం) తగ్గిస్తున్నట్లు ఎంఎస్సీఐ శుక్రవారం ప్రకటించింది. ఆ కంపెనీలు..అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, ఏసీసీలు. మార్పులు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయి. ఎంఎస్సీఐ ఇండెక్స్లో మిగిలిన అదానీ గ్రూప్ కంపెనీల ఫ్రీ ఫ్లోట్ను యథాతథంగా అట్టిపెట్టింది. అయితే ఏ కంపెనీలనూ ఎంఎస్సీఐ ఇండెక్స్ల నుంచి తొలగించలేదు. ఫ్రీఫ్లోట్ తగ్గింపుతో ఇండెక్స్ల్లో ఆయా కంపెనీల వెయిటేజీకి కోత పడుతుందని, ఫలితంగా ఈ షేర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్ల నిధుల్ని అంతర్జాతీయ ఇన్వెస్టర్లు వెనక్కు తీసుకుంటారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎంఎస్సీఐ ఫ్రీ ఫ్లోట్ను తగ్గించిన నాలుగు అదానీ కంపెనీలకు జనవరి 30 నాటికి ఎంఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్ల్లో 0.4 శాతం వెయిటేజి ఉంది. ఎంఎస్సీఐ ఇండియా ఇండెక్స్లో వీటికి 1.95 శాతం వెయిటేజి ఉండగా, మొత్తం 8 అదానీ గ్రూప్ కంపెనీలకు కలిపి 4.5 శాతం వెయిటేజి ఉంది.
అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు లేవనెత్తిన అంశాల దృష్ట్యా తమ ఎంఎస్సీఐ గ్లోబల్ ఇన్వెస్ట్బుల్ ఇండెక్స్ల్లో అదానీ కంపెనీల ఫ్రీ ఫ్లోట్లో మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడిందని, ఈ మేరకు నాలుగు కంపెనీల ఫ్రీ ఫ్లోట్ను తగ్గించినట్టు ఎంఎస్సీఐ తెలిపింది. విదేశీ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్..ఇలా పలు ఇన్వెస్టింగ్ సంస్థలు ఎంఎస్సీఐ ఇండెక్స్ల్ని ట్రాక్ చేస్తూ, ఆ సూచీల్లో ఆయా కంపెనీలకు ఉన్న ఫ్రీ ఫ్లోట్, అందుకు అనుగుణంగా మారే వెయిటేజీ ప్రకారం నిధుల్ని ఉపసంహరించుకోవడం చేస్తుంటాయి. ధరలో మార్పు కారణంగా వెయిటేజీలో మార్పు వస్తుంది. ఉదాహరణకు అదానీ ఎంటర్ప్రైజెస్ ఫ్రీఫ్లోట్ను ఎంఎస్సీఐ 25 శాతం తగ్గిస్తే, ఆ కంపెనీలో ప్రస్తుతం అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఉన్న 430 మిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 110 మిలియన్ డాలర్ల మేర విక్రయించి, ఫ్రీ ఫ్లోట్, అందుకు అనుగుణంగా వెయిటేజీ పెరిగిన కంపెనీలోకి మళ్లించుకుంటారు.