న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 18,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించగా మాస్ లేఆఫ్స్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది. తాజాగా లేఆఫ్స్కు సంబంధించిన సమాచారం అందచేస్తూ 2,300 మంది ఉద్యోగులకు అమెజాన్ హెచ్చరిక నోటీసులు పంపింది. కంపెనీలో మాస్ లేఆఫ్స్తో ప్రభావితమయ్యే ఉద్యోగులకు 60 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాలని అమెరికన్ కార్మిక చట్టాలు నిర్ధేశిస్తున్నాయి.
కంపెనీలో మాస్ లేఆఫ్స్ను అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ ఇటీవల నిర్ధారించిన సంగతి తెలిసిందే. తాజా లేఆఫ్స్ అమెరికా, కెనడా, కోస్టారికాలో ఉద్యోగులపై ప్రభావం చూపనున్నాయి. సీటెల్లో 1852 మంది ఉద్యోగులను, వాషింగ్టన్, బెలెవులో 448 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వాషింగ్టన్ స్టేట్ ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్లో సమర్పించిన నోటీస్లో పొందుపరిచారు. ఇక భారత్లోనూ అమెజాన్ ఉద్యోగులు కొలువులు కోల్పోతున్నారు.
భారత్ ప్రొఫెషనల్స్కు సంబంధించిన కమ్యూనిటీ యాప్ గ్రేప్వైన్లో ఓ అమెజాన్ ఇండియా ఉద్యోగి తమ టీంలో 75 శాతం మందిని తొలగించారని వాపోతూ రాసుకొచ్చారు. 25 శాతం టీంతోనే పనిచేస్తున్నామని, తనకు పనిచేయాలని ఎలాంటి ఆసక్తి లేదని పేర్కొన్నారు. ఇక హర్ష్ అనే ఐఐటీ గ్రాడ్యుయేట్ మాస్ లేఆఫ్స్లో భాగంగా అమెజాన్లో జాబ్ కోల్పోయానని లింక్డిన్లో రాసుకొచ్చారు. కొత్త ఏడాది ఇలా ప్రారంభమవుతుందని తాను కలలో కూడా ఊహించలేదని పేర్కొన్నారు. తాను ఐఐటీ మండిలో సీఎస్ఈ బ్రాంచ్తో బీటెక్ చేసానని మరో కొలువు కోసం అన్వేషిస్తున్నానని హర్ష్ రాసుకొచ్చారు.