న్యూఢిల్లీ : భారత్లో కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ఆర్ధిక కార్యకలాపాలకు విఘాతం కలిగించడంతో వృద్ధి రేటు అంచనాలూ కుదుపులకు లోనవుతున్నాయి. 2021 కేలండర్ సంవత్సరంలో భారత వృద్ధి రేటును గతంలో 13.9 శాతంగా అంచనా వేసిన రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తాజాగా అంచనాల్లో భారీ కోత విధించింది. ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు 9.6 శాతానికి పరిమితమవుతుందని స్పష్టం చేసింది.
వైరస్ తిరిగి పంజా విసరడం 2021లో భారత వృద్ధి అంచనాపై ప్రభావం చూపిందని పేర్కొంది. కరోనా భారత ఆర్ధిక వ్యవస్ధపై చూపిన ప్రతాపం ఏప్రిల్-జూన్ త్రైమాసకానికి పరిమితమవుతుందని పేర్కొంది. ఇక 2022లో జీడీపీ వృద్ధి ఏడు శాతంగా ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు నియంత్రణలను సడలిస్తుండటంతో ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకుంటాయని పేర్కొంది.